'పెరియార్'నూ వదలని బీజేపీ?: తమిళనాడులో ఉద్రిక్తత.. భగ్గుమన్న స్టాలిన్..
Recommended Video
చెన్నై: బీజేపీ సేనలు అన్నంత పనిచేశాయి. త్రిపురలో అధికారంలోకి వచ్చిన వెంటనే లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన బీజేపీ.. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసింది.
లెనిన్ విగ్రహం కూల్చివేత తర్వాత తదుపరి లక్ష్యం పెరియార్ విగ్రహాన్ని కూల్చడమే అని ట్వీట్ బీజేపీ నేత హెచ్.రాజా ట్వీట్ చేయడం.. ఆ వెను వెంటనే పెరియార్ విగ్రహం ధ్వంసం కావడం దేశంలో పరిస్థితులకు అద్దం పడుతోంది.
తమిళనాడులో ఆందోళనలు..:
ద్రవిడ గడ్డ మీద అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి, హేతువాద దృక్పథానికి బీజాలు నాటిని పెరియార్ విగ్రహాన్ని కూల్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో తమిళనాడులో ఉద్రిక్తతలకు తావిచ్చేదిగానూ మారింది. పెరియార్ రామస్వామి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ తమిళ సంఘాలు ఈ ఉదయం ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.
వేలూరులో విగ్రహ ధ్వంసం:
వేలూరులోని తిరుపుత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి గత రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. కార్యాలయంలోని పెరియార్ విగ్రహాన్ని వారు ధ్వంసం చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు బీజేపీ కార్యకర్త కాగా.. మరొకరు మద్యం మత్తులో ఉన్న సీపీఐ నేత అంటున్నారు. పెరియార్ విగ్రహం కళ్లు, ముక్కును వీరు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
హెచ్.రాజా కామెంట్స్ వల్లే:
పెరియార్ విగ్రహ ధ్వంసం వెనుక బీజేపీ నేత హెచ్.రాజా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే ప్రధాన కారణంగా చెబుతున్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేసిన నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు.
'ఎవరీ లెనిన్?.. ఇండియాకు ఆయనకేం సంబంధం?.. కమ్యూనిజానికి ఇండియాకు సంబంధమేంటి?.. ఈరోజు త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసమైంది. రేపు తమిళనాడులో కులవాది పెరియార్ విగ్రహం ధ్వంసమవుతుంది' అంటూ హెచ్.రాజా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు.
భగ్గుమన్న స్టాలిన్..:
హెచ్.రాజా ఫేస్ బుక్ లో చేసిన పోస్టుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ పోస్టును తన పేజీ నుంచి తొలగించారు హెచ్.రాజా.
దీనిపై స్పందించిన స్టాలిన్ 'పెరియార్ విగ్రహాన్ని టచ్ చేసేంత దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు. హెచ్.రాజా కామెంట్స్ హింసాత్మక పరిస్థితులకు దారితీసేలా ఉన్నాయి. పదేపదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్న ఆయన్ను గూండా కింద అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలి' అని డిమాండ్ చేశారు.
మాట మార్చిన రాజా:
మరోవైపు హెచ్.రాజా తాను చేసిన పోస్టుపై మాట మార్చారు. తాను కామెంట్ చేసినట్టు చెబుతున్న ఫేస్ బుక్ పేజీ అసలు తనది కాదని, వేరెవరో దాన్ని మెయింటెయిన్ చేస్తున్నారని అన్నారు.
కాగా, హెచ్.రాజా చేసిన కామెంట్స్ తో బీజేపీ మద్దతుదారులు పెరియార్ విగ్రహాన్ని కూల్చడానికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ట్విట్టర్ లో పోస్టులు కూడా పెట్టారు. ఈ పరిస్థితులే విగ్రహ ధ్వంసానికి దారి తీశాయని అంటున్నారు.