మొన్న బాత్రూమ్ వీడియోలు - ఇప్పుడు స్టూడెంట్స్ సూసైడ్: యూనివర్శిటీలో రచ్చరచ్చ
చండీగఢ్: మొన్నటికి మొన్న పంజాబ్ చండీగఢ్ యూనివర్శిటీలో విద్యర్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వీడియోలను చిత్రీకరించిన ఓ విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసిన ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా సద్దుమణగట్లేదు.
అదే సమయంలో పంజాబ్కే చెందిన మరో యూనివర్శిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. తాజా ఉదంతంతో విద్యార్థులందరూ ఆందోళనకు దిగారు. క్యాంపస్లో బైఠాయించారు. తరగతులను బహిష్కరించారు. రాత్రంతా క్యాంపస్లో బైఠాయించారు. పంజాబ్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి పేరు అగ్ని ఎస్ దిలీప్. కేరళకు చెందిన విద్యార్థి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ స్టూడెంట్. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 10 రోజుల వ్యవధిలో రెండో ఆత్మహత్య కేసు కావడం కలకలం సృష్టించింది. దిలీప్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
సమాచారం అందిన వెంటనే ఫగ్వారా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ముఖ్తియార్ రాయ్, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ జస్ప్రీత్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కారణాలతోనే దిలీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అయినప్పటికీ- అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తామని చెప్పారు.
మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. తొలి ఆత్మహత్య కేసు ఇప్పటివరకూ పరిష్కారం కాలేదని, ఎందుకు సూసైడ్కు పాల్పడాల్సి వచ్చిందనేది తెలియరావట్లేదంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ ఘటన పట్ల లవ్లీ యూనివర్శిటీ అధికారులుు స్పందించారు. దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరిస్తామని చెప్పారు.