బీజేపీకి ఇక నల్లేరుపై నడకే-రాజ్యసభలో 100 దాటిన సీట్లు- అలవోకగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు
దేశవ్యాప్తంగా అంతకంతకూ బలం పెంచుకుంటూ పోతున్న బీజేపీ తాజాగా మరో రికార్దు అందుకుంది. పార్లమెంటులో ఎప్పటినుంచో ఊరిస్తున్న రాజ్యసభలో బలాన్ని సాధించింది. దీంతో పెద్దల సభలో ఏ బిల్లు అయినా సొంత మెజారిటీతో ఆమోదింపజేసుకునే అవకాశం లభించింది. అంతే కాదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం సొంత అభ్యర్ధుల్ని నిలబెట్టి నెగ్గించుకునే అవకాశం దక్కబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా ఫీట్ పై ఓ కథనం ..
రాజ్యసభలో బీజేపీ ఫీట్
2014లో భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి ఈ 8 ఏళ్లలో చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా లోక్ సభలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో తగిన మెజారిటీ లేకపోవడంతో ఎన్నో కీలక బిల్లుల్ని నెగ్గించుకునేందుకు మిత్రపక్షాలపైనా,మిత్రపక్షాలు కాని మిత్రపక్షాలపైనా ఆధారపడాల్సి వచ్చింది. ఇందుకోసం వారు అడిగినవన్నీ చేయాల్సిన పరిస్ధితులూ దాపురించాయి. దీంతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వారిని బుజ్జగించాల్సి వచ్చింది. కానీ తాజాగా మాత్రం 100కు పైగా సీట్లు సాధించి 1988 తర్వాత ఈ రికార్డు సాధించిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. నిన్న రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 4 సీట్లు సాధించడం ద్వారా బీజేపీ 100 సీట్ల మార్క్ దాటింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రభావం
త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ, ఎన్డీయే మాత్రమే కాదు యూపీయే కూడా ఇరు సభల్లోనూ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. దీంతో ఈ రెండు కీలక ఎన్నికల్లోనూ మిత్రపక్షాలపై, ఇతర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్దితి వచ్చేది. కానీ ఈసారి బీజేపీకి మాత్రం ఆ పరిస్ధితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వందకు పైగా సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి ఎవరి సాయం లేకుండానే సొంతగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధులను నిలబెట్టడంతో పాటు నెగ్గించుకునే వీలు దొరికింది. ఈ ఏడాది జూలై, ఆగస్టులో జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి.
34 ఏళ్ల విరామం తర్వాత
పార్లమెంటులో 1988 వరకూ కాంగ్రెస్ పార్టీకి ఉభయసభల్లోనూ సంపూర్ణ మెజారిటీ ఉండేది. దీంతో సొంతంగా బిల్లులు నెగ్గించుకోవడంలో కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం రాజ్యసభలో మెజారిటీ దోబూచులాడుతూ వచ్చింది. అలాగే లోక్ సభలోనూ చాలా ఏళ్ల పాటు ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. కానీ 2014 తర్వాత మాత్రం బీజేపీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీని అందుకుంది. 2019లో ఆ బలాన్ని మరింత పెంచుకుంది. అయినా రాజ్యసభలో మెజారిటీ మాత్రం పార్టీలకు అందని ద్రాక్షే అవుతోంది. ఇప్పుడు తాజాగా గెలిచిన నాలుగు సీట్లతో బీజేపీ మెజార్టీ మార్కు దాటకపోయినా 100 సీట్ల మార్క్ దాటడంతో 34 ఏళ్ల విరామం తర్వాత ఓ జాతీయ పార్టీ ఉభయసభల్లోనూ వంద సీట్లకు పైగా సాధించి బిల్లుల్ని నెగ్గించుకునే అవకాశం దక్కించుకుంది.