పాపం మనోజ్ తివారీ.. ఇలా దొరికిపోయాడు.. ఆ పాటతో ఆడేసుకుంటున్న నెటిజెన్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువమంది గూగుల్లో దేనికోసం వెతికారో తెలుసా.. ఢిల్లీ బీజేపీ చీఫ్,ఎంపీ మనోజ్ తివారీ పాట 'రింకియా కే పాపా' కోసం ఎక్కువమంది సెర్చ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగా పాపులర్ అయిన ఈ పాటను.. ప్రీపోల్,పోలింగ్,ఎగ్జిట్ పోల్స్ సమయంలో కంటే.. ఫలితాల తర్వాతే ఎక్కువమంది ఈ పాట కోసం సెర్చ్ చేసినట్టు గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. రింకీయా కే పాపా మీమ్స్ను కూడా ఎక్కువమంది సెర్చ్ చేసినట్టు వెల్లడైంది.
బొక్కబోర్లా పడ్డ మనోజ్ తివారీ..
భోజ్పురిలో మనోజ్ తివారీ పాడిన పాటల్లో బాగా పాపులర్ అయినవాటిల్లో రింకీయా కే పాపా ఒకటి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినరోజు.. 'నా ట్వీట్ సేవ్ చేసి పెట్టుకోండి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులవుతాయి. బీజేపీ కచ్చితంగా 48 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అనవసరంగా ఈవీఎంలను బద్నాం చేసేందుకు ప్రయత్నించకండి.' అంటూ ఆయన ట్వీట్ చేశారు. తీరా ఫలితాలు చూస్తే... తలకిందులైంది ఎగ్జిట్ పోల్స్ కాదు,మనోజ్ తివారీ అంచనాలు అని తేలిపోయింది. దీంతో సోషల్ మీడియాలో మనోజ్ తివారీని 'రింకీయా కే పాపా' పేరుతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
తివారీపై ట్రోలింగ్స్
ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో.. ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. పలువురు కార్యకర్తలు 'రింకీయా కే పాపా' పాటను తమదైన స్టైల్లో పాడుతూ డ్యాన్సులు కూడా చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆప్ మద్దతుదారులతో పాటు,సాధారణ నెటిజెన్స్ కూడా రింకీయా కే పాపా సాంగ్స్, మీమ్స్తో తివారీని ట్రోల్ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో పాపులర్ అయిన పాట..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అటు ఆమ్ ఆద్మీ,ఇటు బీజేపీ సోషల్ మీడియా విభాగాలు ఓటర్లను ఆకర్షించడానికి రింకీయా కే పాపా సాంగ్ను బాగా వాడుకున్నాయి. ఈ సాంగ్తో ఆమ్ ఆద్మీ మనోజ్ తివారీని ట్రోల్ చేయగా.. 'రింకీయా అబద్దం చెప్పదు' అంటూ బీజేపీ కేజ్రీవాల్ను టార్గెట్ చేసింది. అదే సమయంలో రింకీయా పాటను హేళన చేయడం ద్వారా కేజ్రీవాల్ పూర్వాంచలీ కమ్యూనిటీని అవమానిస్తున్నారని ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఎవరినీ హేళన చేయలేదని,పైగా మనోజ్ తివారీ పాటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆయన పాటలు ఎప్పుడూ వింటుంటాని,డ్యాన్సులు కూడా బాగా చేస్తారని అన్నారు.
మూడోసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఐదు స్థానాలు తగ్గినప్పటికీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మరోవైపు బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే గతంతో పోలిస్తే తన స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక కాంగ్రెస్ అయితే ఖాతానే తెరవలేదు. మొత్తం మీద 2013,2015 ఎన్నికలతో పాటు ఆమ్ ఆద్మీ విజయ ప్రస్థానంలో 2020 ఎన్నికలు కూడా చేరాయి. వరుసగా మూడుసార్లు ఢిల్లీ పీఠాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది.