బకాయిలు వసూల్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో 80 వేల కోట్ల అప్పులు చెల్లించారు
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత దేశ వ్యాప్తంగా 80 వేల కోట్లను అప్పు కింద చెల్లించారు. రద్దుచేసిన నగదును అప్పు చెల్లింపుల కోసం ఉపయోగించారు.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా సుమారు 80 వేల కోట్ల రూపాయాలను రద్దుచేసిన నోట్ల ద్వారా చెల్లించారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశంలోని ఏఏ బ్యాంకుల్లో ఏ మేరకు పెద్ద మొత్తంలో నగదు జమ అయిందనే విషయమై ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తర్వాత ఏ మేరకు నల్లధనం వెలికి తీశారో చెప్పాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నెల 20వ, తేదిని పిఎసి చైర్మెన్ థామస్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ ను ఆదేశించాడు పిఎసి చైర్మెన్
పెద్ద నగదు నోట్ల రద్దు కు కారణాలు ఏమిటి, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయనే విషయాలపై ఆర్ బి ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ లెక్కలను తీస్తోంది.
80 వేల కోట్ల రుణాలను పాత నోట్లతో చెల్లించారు
పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం గత ఏడాది నవంబర్ 8వ, తేది రాత్రి నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత యాభై రోజుల పాటు ఈ రద్దుచేసిన నగదును మార్చుకొనే అవకాశం కల్పించింది. ఈ గడువులోపుగా తమ వద్ద ఉన్న రద్దుచేసిన నగదును వదిలించుకొనేందుకు చాలా మంది కష్టపడ్డారు.అయితే రద్దుచేసిన నగదుతో పాత బకాయిలను చెల్లించారు. ఈ రకంగా దేశ వ్యాప్తంగా సుమారు 80వేల కోట్ల రుణాలను చెల్లించారని ఆదాయపు పన్నుశాఖ అధికారులు గుర్తించారు.
భారీగా నగదు డిపాజిట్లు చేసిన ఖాతాలపై ఆదాయపుపన్నుశాఖ కన్ను
పెద్ద నగదు నోట్ల తర్వాత దేశవ్యాప్తంగా ఏఏ బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు డిపాజిట్ అయిందనే విషయాలపై ఆదాయపు పన్నుశాకాధికారుల కేంద్రీకరించారు. నవంబర్ 8వ, తేది కంటే ముందుగా ఆయా ఖాతాల్లో ఏ మేరకు నగదు లావాదేవీలున్నాయి. ఆ తర్వాత ఏ మేరకు లావాదేవీలు జరిగాయనే విషయాలను ఆదాయపు పన్నుశాఖ కేంద్రీకరించి పనిచేస్తోంది.దేశ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా ఖాతాల్లో రెండులక్షల కంటే ఎక్కువగా నగదును జమ చేసినట్టు అధికారులు గుర్తించారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాతే 25 వేల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నవంబర్ 10వ, తేది నుండి డిసెంబర్ 30వ, తేది మద్య కాలంలో సుమారు 25 వేల కోట్లు డిపాజిట్ అయ్యాయని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. పెద్ద నగదు నోట్లు రద్దుచేయడం వల్లే ఈ నగదు అంతా బ్యాంకుల్లో జమ అయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది.దీనికి లెక్కలు చూపారా లేదా అనే అంశాలపై ఆదాయపు పన్నుశాఖ ఆరా తీస్తోంది.
పన్ను చెల్లించని సొమ్ము మూడు నుండి నాలుగు లక్షల కోట్లు
దేశ వ్యాప్తంగా పనన్ను చెల్లించని సొమ్ము సుమారు మూడు నుండి నాలుగు లక్షల కోట్లు ఉంటుందని ఆదాయపు పన్నుశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో 10,700 కోట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యాయని ఐటిశాఖాధికారులు అనుమానిస్తున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకు బ్రాంచ్ లపై ఆదాయపు పన్నుశాఖాధికారులు నిఘా ఏర్పాటుచేశారు.
సహకార బ్యాంకుల్లో కూడ పెద్ద ఎత్తున డిపాజిట్లు
దేశ వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో కూడ పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయినట్టుగా ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకు ఖాతాల్లో సుమారు 16 వేల కోట్లు జమ అయిందని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా శాఖల్లో ఎవరెవరు ఎంతమొత్తంలో నగదును డిపాజిట్ చేశారనే విషయమై ఆదాయపుపన్నుశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.