అసెంబ్లీలో సభ్యుడి సీటు కింద పేలుడు పదార్థాలు: యోగి సీరియస్, ఎన్ఐఏ దర్యాప్తు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పేలుడు పదార్థారాలు లభించడం కలకలం సృష్టించింది. యూపీలో గత నాలుగు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సమావేశం జరుగుతుండగా..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పేలుడు పదార్థారాలు లభించడం కలకలం సృష్టించింది. యూపీలో గత నాలుగు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సమావేశం జరుగుతుండగా.. సభలోని ఓ సీటు కింద అనుమానాస్పద ప్యాకేట్ గుర్తించారు.
సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్ పాండే సీటు కింద ఈ ప్యాకేట్ కనిపించింది. ప్యాకేట్ తెరిచి చూడగా, అందులో తెల్లని పొడిలాంటి పదార్థం ఉంది. అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని భద్రతాసిబ్బంది ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. అయితే, ఆ పొడి పేలుడు పదార్థమని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రతా అధికారులు అసెంబ్లీతోపాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అసెంబ్లీలో పేలుడు పదార్థాలు లభించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. శుక్రవారం అసెంబ్లీ భద్రతపై సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం ముగిసిన అనంతరం యోగి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో లభించిన తెల్లటి పొడి.. పీఈటీఎన్ అనే పేలుడు పదార్థమని తెలిపారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దర్యాప్తు చేస్తారని చెప్పారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకుంటామని యోగి స్పష్టం చేశారు. భద్రతాపరమైన నిబంధనలు జారీ చేస్తామని, ప్రతి ఒక్కరూ వాటిని అనుసరించాలని యోగి తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉండగా, అసెంబ్లీలో పేలుడు పదార్థాలు లభించడంపై కాంగ్రెస్, విపక్షాల నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర పరిస్థితి ఏంటని వారు నిలదీశారు.