చావ్లా, సునీత బాటలో: నింగిలోకి భారత సంతతి మహిళ షాన పాండ్య
త్వరలో భారత సంతతి వ్యోమగామి షాన పాండ్య అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రలకు వెళ్లి భారత కీర్తిని ఇనుమడింపజేసిన విషయం తెలిసిందే. కాగా, త్వరలో మరో భారత సంతతి వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
డాక్టర్ షాన పాండ్య (32) ప్రస్తుతం కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీ హస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ (సీఎస్ఏ) ప్రోగ్రాం కోసం 3,200 మంది నమోదు చేసుకోగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఇద్దరిలో పాండ్య ఒకరు. 2018లో ఎనిమిది మంది వ్యోమగాములతో కలిసి ఈమె కూడా అంతరిక్షయాత్రకు వెళ్లనుంది.
కాగా, ఇటీవలే పాండ్య.. ముంబై నగరంలోని సొంత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మిషన్లో భాగంగా బయో మెడిసిన్, మెడికల్ సైన్స్లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
'పోలార్ సబ్ఆర్బిటల్ సైన్స్ ఇన్ ది అప్పర్ మెసోస్పియర్' ప్రాజెక్టులో భాగంగా వాతావారణ మార్పుల ప్రభావంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని పాండ్య వివరించారు.