మరోసారి కాల్పులకు తెగబడిన పాక్: దెబ్బకు దెబ్బ తీయాలన్న రాజ్నాథ్
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం మంగళవారం భారత జవాన్లపై కాల్పులకు పాల్పింది.
యూరీ సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ సైన్యం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగిన రెండు రోజుల్లోనే పాక్ సైన్యం సరిహద్దులో కాల్పులకు తెగబడటం గమనార్హం. అయితే దాయాది దేశం కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది.
యూరీ సైనిక స్థావరంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాక్ నుంచి వచ్చిన జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారే ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తున్న సమయంలో సరిహద్దులో పాక్ కాల్పులకు దిగింది.
దెబ్బకు దెబ్బ తీయండి: రాజ్నాథ్
యూరీలో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు దిగడంపై హోంమంత్రి రాజ్నాథ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉగ్రదాడులు, పాక్ సైన్యం కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఎస్ఎఫ్ డీజీకి సూచించారు. ఈ విషయంలో స్వేచ్ఛ తీసుకోవచ్చని వారికి సూచించినట్లు సమాచారం.
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ విషయంపై అందరితో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.