మోడీకి ఒమర్, శశిథరూర్ ప్రశంస: హంపీకి మోడీ భార్య!
న్యూఢిల్లీ/శ్రీనగర్: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యూపిఏ పక్షాల నుండి అభినందనలు అందుతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పలువురు కాంగ్రెస్, యూపిఏ పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ పైన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు.
నరేంద్ర మోడీ ప్రసంగం తనను ఆకట్టుకుందని శశిథరూర్ చెప్పారు. మోడీ తన సందేశంలో శాంతిని, కలుపుకుపోయే విషయాన్ని చెప్పారని ట్వీట్ చేశారు. ఒమర్ అబ్దుల్లా కూడా ప్రశంసలు కురిపించారు. సార్క్ దేశాల నేతలను తన ప్రమాణ స్వీకారానికి మోడీ పిలువడం పట్ల ఒమర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా పాకిస్తాన్ ప్రధానిని ఆహ్వానించడం... పాక్తో చర్చలకు తొలి అడుగుగా భావించారు.
హంపీకి మోడీ భార్య!
భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ సతీమణి జశోదా బెన్ బుధవారం కర్నాటకలోని చారిత్రక హంపీకి సమీపంలోని పంపా సరోవరాన్ని దర్శించారు. గుజరాత్ నుండి సుమారు 800 మంది యాత్రికులతో కలిసి ప్రత్యేక రైలులో చార్ధామ్ యాత్రలో భాగంగా ఆమె పంపా సరోవరానికి వచ్చారని సమాచారం.
మధ్యాహ్నం వచ్చిన ఆమె యాత్ర ముగింపుగా పంపా సరోవరంలోని జయలక్ష్మీదేవిని దర్శించి, హారతి ఇచ్చి బాబా రాందాస్ ఆశీర్వాదం పొంది వెళ్లారని చెబుతున్నారు. ఆమె రాకను గోప్యంగా ఉంచారు. పంపా సరోవరంలో ఆమె కేవలం ఓ గ్లాసు మంచినీళ్లు మాత్రమే స్వీకరించారట. రైల్లో వచ్చిన గుజరాత్ యాత్రికుల బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం జశోదాబెన్ యాత్రకు రాలేదంటున్నారు.