ప్రమాద ఘంటికలు: అంకెల అలజడి..దిగజారిన జీడీపీ: ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. !
న్యూఢిల్లీ: స్థూల జాతీయోత్పత్తి..జీడీపీ. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు. దేశం ఆర్థికంగా పురోగమిస్తోందనడానికి లేదా క్షీణిస్తోందనడానికి జీడీపీ అంకెలా సాక్ష్యం. అలాంటి జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ కేవలం 4.5 శాతం మాత్రమే. జాతీయ గణాంకాల కార్యాలయం (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్-ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఒక్కసారిగా దేశ ఆర్థికరంగంలో అలజడిని సృష్టించింది.

దెబ్బ కొట్టిన తయారీ రంగం..
దేశ తయారీ రంగంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా నెలకొన్న స్తబ్దత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. తయారీ రంగం, సేవా రంగం.. ఈ రెండింటినీ దేశ ఆర్థికరంగానికి వెన్నెముకగా భావిస్తారు. అలాంటి తయారీ రంగం రికార్డు స్థాయిలో క్షీణతను నమోదు చేసింది. వాహన తయారీ యూనిట్లు చాలా మటుకు వారంలో రెండు రోజుల పాటు సెలవును ప్రకటించుకోవాల్సి వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరానితో పోల్చుకుంటే భారీ క్షీణత..
2019-2020 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తయారీ రంగంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని ఈ నివేదిక స్పష్టం చేసినట్టయింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2018-2019 ఆర్థిక సంవత్సరానితో పోల్చుకుంటే తయారీ రంగం అత్యంత కనిష్ఠతన నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 12.1 శాతం పురోభివృద్ధిని నమోదు చేసిన తయారీ రంగంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి 0.6 శాతానికి పడిపోయింది.

తొలి త్రైమాసికం కంటే క్షీణత..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కంటే కూడా దారుణ క్షీణత నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తయారీ రంగంలో 3.1 శాతం పురోభివృద్ధి రికార్డయింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ లతో కూడిన రెండో త్రైమాసికంలో మరింత దిగజారి 0.6 శాతం మాత్రమే నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. వ్యవసాయం, గనులు, విద్యుత్ ఉత్పాదక రంగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు అవసరమని అంటున్నారు.

కీలక రంగాల్లో తిరోగమనం..
బొగ్గు ఉత్పత్తిలో 17.6 శాతం, క్రూడాయిల్-5.1, సహజవాయు-5.7 శాతం జీడీపీ నమోదు కాగా.. సిమెంట్ ఉత్పత్తిలో మైనస్ 7.7 శాతం పురోభివృద్ధి కనిపించింది. అదే పరిస్థితి మరో రెండు కీలక ఉత్పత్తి రంగాల్లోనూ నెలకొంది. స్టీల్ ఉత్పాదనలో మైనస్ 1.6 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో ఏకంగా మైనస్ 12.4 శాతం తిరోగమనం రికార్డయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లతో కూడిన మూడో త్రైమాసికంలో ఇంత కంటే మెరుగైన ఫలితాలను ఆశించలేమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే..
తయారీ రంగంలో నెలకొన్న పురోగమనం కేవలం 0.6 శాతం మత్రమే నమోదు కావడం ఆర్థిక వేత్తలను అత్యంత కలవరపాటుకు గురి చేస్తోన్న విషయం. వారి పరిభాషలో చెప్పాలంటే.. తయారీ రంగంలో దివాళా తీసినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకునిపోవడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆర్థిక రంగం కోలుకోవడానికి తక్షణ చర్యలు అవసరమని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.












Click it and Unblock the Notifications