గోవాలో వాలిన దీదీ: 3 రోజులు అక్కడే.. పట్టు కోసం పాట్లు..?
దీదీ మమతా బెనర్జీ కన్ను గోవాపై పడిందా అంటే ఔననే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె 3 రోజులు గోవాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నికల్లో సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో టీఎంసీ ముందుకు సాగుతుంది. 40 అసెంబ్లీ స్థానాలు గల కేంద్రపాలిత ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మూడు రోజుల గోవా పర్యటకు వెళ్లారు.
ఇవాళ మధ్యాహ్నాం గోవా ఎయిర్పోర్టుకు చేరుకున్న మమతకు స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. గోవా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక పార్టీ నేతలతో మమత చర్చించనున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఎంసీలోకి వచ్చే అవకాశం ఉన్న నేతల విషయంపై కూడా మమతాబెనర్జి చర్చించనున్నారు.
ఇప్పటికే గోవాలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. ప్రజల్లో పట్టున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా టీఎంసీలోకి ఆహ్వానించాలని టీఎంసీ అధినేత్రి భావిస్తున్నారు. ఇక,ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ టీమ్ గోవాల్ టీఎంసీ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.
Recommended Video
గోవాలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే సత్తా టీఎంసీకే ఉందని మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీని బలోపేతం చేసేందుకు మమతా బెనర్జీ చాలా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు టీఎంసీ ఘాటైన జవాబు ఇచ్చింది. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ నాయకత్వానికి చేతకావడం లేదని తీవ్రంగా విమర్శించారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు. మరోవైపు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.