ఈసీ సంచలనం: బెంగాల్ డీజీపై వేటు -వీరేంద్ర స్థానంలో కొత్త పోలీస్ బాస్గా నీరజ్ నయన్ -కేంద్రం ఒత్తిడి?
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి ఫోకస్ పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. అందుకు తగ్గట్లే, మోదీ-షా నేతృత్వంలోని బీజేపీ, మమత నాయకత్వంలోని టీఎంసీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈలోపే సంచలన రీతిలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో రాష్ట్ర డీజీపీ వీరేంద్రపై వేటు వేసింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ వీరేంద్రను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆయన స్థానంలో 1987 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి పి.నీరజ్ నయన్ను నియమించింది.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ కార్యదర్శి రాకేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. డీజీపీ పదవి నుంచి తప్పించిన వీరేంద్రకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. బెంగాల్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా,
గత లోక్ సభ ఎన్నికల సమయం నుంచే పశ్చిమ బెంగాల్ పోలీసు శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతున్నది. కేంద్ర హోం శాఖ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదంటూ బెంగాల్ పోలీసులకు సీఎం మమత అండగా నిలిచారు. ఢిల్లీని ధిక్కరించిన అధికారులకు కోల్ కతాలో సన్మానాలు కూడా చేశారు. ప్రస్తుత ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర పోలీసులు టీఎంసీకి సహకరిస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఆ క్రమంలోనే కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి బెంగాల్ డీజీపీని బదిలీ చేయించిందనే చర్చ నడుస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో ఈసీ.. డీజీపీలను బదిలీ చేయడం ఇది కొత్తేమీ కాదు.