పాక్ ఉగ్రదాడి: శ్రీనగర్ లో సూత్రధారి అరెస్టు
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని ఉధమ్ పూర్ లో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద పాక్ ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి సహకరించారని ఆరోపిస్తూ జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు అహమ్మద్ భట్ అలియాస్ ఖుర్షీద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఖుర్షీద్ ట్రక్కు యజమాని. అతని వాహనంలో పాక్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉధమ్ పూర్ చేరుకున్నారు. తరువాత జాతీయ రహదారి మీద బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లతో పాటు నొమన్ అనే ఓ పాక్ ఉగ్రవాది మరణించాడు.
పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబాకు చెందిన మహమ్మద్ నవెద్ అనే ఉగ్రవాదిని భారత్ జవాన్లు ప్రాణాలతో పట్టుకున్నారు. తరువాత ఎన్ఐఏ అధికారులు ట్రక్ ను గుర్తించి స్వాధీనం చేసుకుని ఆ వాహనం డ్రైవర్ ను అరెస్టు చేశారు.
ఉధమ్ పూర్ దాడులకు సంబంధించి ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారి ఆచూకి చెబితే రూ. రెండు లక్షలు బహుమానం అందిస్తామని ప్రకటించారు. ఖుర్షీద్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అప్పటి నుంచి అతని కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు.
కచ్చితమైన వివరాలు సేకరించిన అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఖుర్షీద్ ను ప్రాణాలతో పట్టుకున్నారు. పాక్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబాకు జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటున్న ఎవరెవరు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు అని నవెద్, ఖుర్షీద్ ల నుంచి వివరాలు రాబట్టాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.