జయ పార్టీనే జెండాను అవనతం చేసి, ఎగరేసింది: ఏది నమ్మాలో..!
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి చెందారనే ప్రచారం నేపథ్యంలో.. అన్నాడీఎకే కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి చెందారనే ప్రచారం నేపథ్యంలో.. అన్నాడీఎకే కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. జయ మరణవార్త ప్రచారం తట్టుకోలేక అభిమానులు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కాగా, మరో జిల్లా కార్యాలయంలోను జెండాను అవనతం చేశారు. ఆ తర్వాత మళ్లీ జెండాను ఎగురవేశారు.
అయితే, అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నామని ప్రకటించింది. ఇదిలా ఉండగా తమిళనాడులో హైఅలర్ట్ కొనసాగుతోంది. చెన్నై పోలీసుల దిగ్బంధంలో ఉంది. అపోలో సీఆర్పీఎఫ్ వలయంలో ఉంది.

తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశం వదంతుల కారణంగా తీవ్ర గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ పక్క స్థానిక టీవీ ఛానెళ్లలో అమ్మ కన్నుమూశారన్న వార్తలు ప్రసారం అవడం, చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవనతం చేయడంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారిక ప్రకటన ఏమీ లేకుండానే చోటు చేసుకుంటున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి.
జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెన్నైకి చేరుకున్నారు. ఇప్పటికే ఆయన తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో సంప్రదించి జయ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు నేరుగా చెన్నైకి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications