పన్నీర్ కొంపముంచిన కొత్త గ్రూప్: డిప్యూటీ సీఎం పదవితో సహ అన్నీ ! లేదంటే ?
ఎడప్పాడి పళనిసామి వర్గానికి ముప్పుతిప్పలు పెడుతున్న పన్నీర్ సెల్వం కొంప ముంచడానికి ఇప్పుడు మరో వర్గం తయారైయ్యింది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి ఇప్పుడు పోటీగా మరో వర్గం తయారైయ్యింది.
రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలకు చుక్కలు చూపించడానికి మరో గ్రూప్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇంత వరకు పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లతో విసిగిపోయిన ఎడప్పాడి పళనిసామి వర్గానికి మరో సవాలు ఎదురుకావడంతో సతమతం అవుతున్నారు.
పన్నీర్ సెల్వం కొంప మునిగింది
గత 10 రోజుల నుంచి ఎడప్పాడి పళనిసామి వర్గానికి ముప్పుతిప్పలు పెడుతున్న పన్నీర్ సెల్వం కొంప ముంచడానికి ఇప్పుడు మరో వర్గం తయారైయ్యింది. కొత్తగా తెరమీదకు వచ్చిన వర్గంలో 28 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో పన్నీర్ సెల్వం వర్గం సైతం ఆందోళనకు గురైయ్యింది.
గుట్టుచప్పుడు కాకుండానే
ప్రస్తుతం తెరమీదకు వచ్చిన అన్నాడీఎంకే కొత్త వర్గానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ? పళనిసామి ఏమైనా నాటకాలు ఆడుతున్నారా ? అంటూ పన్నీర్ సెల్వం వర్గం ఆరా తీస్తోంది. కొత్తగా తెరమీదకు వచ్చిన ఎమ్మెల్యేలు చెన్నైలో సమావేశం అయ్యారు.
పన్నీర్ వర్గం మీద అనుమానం
ఓ పక్క పళనిసామి మీద పన్నీర్ సెల్వం వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. మరో పక్క పన్నీర్ సెల్వం వర్గం మీద ఎడప్పాడి పళనిసామి వర్గీయలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రూప్ గా తయారైన పన్నీర్ సెల్వం మరో గ్రూప్ ఎందుకు తయారు చేస్తారు అంటూ ఆయన వర్గంలోని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
డిమాండ్లు తీర్చడం సాధ్యం అయ్యేపనేనా ?
కొత్తగా తెరమీదకు వచ్చిన 28 మంది ఎమ్మెల్యేలు గురువారం కొన్ని డిమాండ్లను ప్రభుత్వానికి పంపించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి వర్గంలో తమకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వాలని సందేశం పంపించి బాంబు పేల్చారు.
ఎన్ని గ్రూపులు
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎడప్పాడి పళనిసామి, రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గం ప్రస్తుతం తెరమీద ఉన్నారు. శశికళ కుటుంబానికి చెందిన టీటీవీ దినకరన్, దివాకరన్ మరో రెండు వర్గాలుగా ఉన్నారు.
మాడు కాదు ఐదు గ్రూపులు
ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని అరెస్టు అయిన టీటీవీ దినకరన్ వర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. శశికళ సోదరుడు దివాకరన్ సైతం నా వర్గంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు మరో వర్గం తెరమీదకు రావడంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.
లాభంలేదని తెలుసున్న పన్నీర్, పళనిసామి
ఇప్పటి పరిస్థితి గమినిస్తుంటే ఎంత త్వరగా రాజీ అయితే అంత మంచిదని పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గంలోని నాయకులు ఆలోచిస్తున్నారు. వీలైనంత త్వరగా విలీనం విషయంలో ముందుకు వెళ్లాలని, లేదంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇరు వర్గాలు భావించాయని తెలిసింది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.