మోడీ-యోగి సర్కార్ దుమ్ము దులిపిన సోనియా గాంధీ: ఈ స్థాయి ధరలు ఎప్పుడైనా చూశారా?
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వాతావరణం మరింత వేడెక్కుతోంది. దశలవారీగా పోలింగ్ ముగుస్తోన్నకొద్దీ- తరువాతి విడతలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఇప్పటిదాకా ముగిసిన విడతల్లో తమకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు లభిస్తాయోనంటూ బేరీజు వేసుకుంటోన్నాయి. మిగిలిన దశల్లో నిర్వహించే పోలింగ్పైనా అదే ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. దీనికి అనుగుణంగా తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని రూపొందించుకుంటోన్నాయి.

231 స్థానాలకు మిగిలిన దశల్లో..
ఉత్తర ప్రదేశ్లో ఇప్పటిదాకా మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ మిగిలివుంది. 231 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఎన్నికలను ఎదుర్కొనబోయే నియోజకవర్గాల్లో జెండా పాతడానికి సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

సోనియాగాంధీ బరిలో..
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఆమె ఉత్తర ప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ రెండు ప్రభుత్వాలు ఓటర్లను నిలువునా మోసం చేస్తోన్నాయని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కష్ట కాలంలో ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు.

మోడీ-యోగి ప్రభుత్వాలపై..
లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు, చిరు వ్యాపారులు.. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని సోనియా గాంధీ గుర్తు చేశారు. వందలాది కిలోమీటర్లు కాలి నడకన నడవాల్సిన దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని విమర్శించారు. వేలాదిమంది వలస కార్మికులు బాధలను పట్టించుకోవడంలో మోడీ-యోగి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించలేకపోయాయని అన్నారు. యోగి ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో చేతులెత్తేసిందని సోనియాగాంధీ గుర్తు చేశారు.

ఈ ఎన్నికలు ఎంతో కీలకం..
ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని సోనియా గాంధీ ఓటర్లకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలను కల్పించలేకపోయిందని విమర్శించారు. రైతులు కష్టించి పండించిన పంటకు సరైన ధరను కూడా కల్పించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కనీసం ఎరువులను సైతం సమకూర్చలేకపోయిందని అన్నారు. కష్టపడి చదువుకుని, ఉద్యోగాల కోసం సిద్ధపడిన యువతను బీజేపీ ప్రభుత్వం ఇంట్లో కూర్చోబెట్టిందని మండిపడ్డారు.
Recommended Video

ఏనాడైనా ఈ ధరలు చూశారా?
బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారని సోనియా గాంధీ విమర్శించారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటగ్యాస్ ధరలను ఆకాశాన్ని అంటేలా చేసిందని, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ధరలను నియంత్రించే శక్తి సామర్థ్యాలు బీజేపీ ప్రభుత్వానికి లేవని ధ్వజమెత్తారు. వంటనూనెల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ఏనాడైనా ఈ స్థాయిలో ధరలను చూశారా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications