జూన్ 24 నుంచే అగ్నిపథ్ స్కీంలో రిక్రూట్మెంట్: ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి
న్యూఢిల్లీ: నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అమలుకు అడుగులు ముందుకే పడుతున్నాయి. అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు.
తాజాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా అగ్నిపథ్ నియామకాలపై స్పందించారు. జూన్ 24 నుంచి ఎయిర్ఫోర్స్లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే అగ్నిపథ్ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్ నియమకాలు జూన్ 24న ప్రారంభం కానున్నాయని తెలిపారు.
కాగా, 'అగ్నిపథ్' పేరిట 17.5 నుంచి 21 ఏళ్ల వారు సైన్యంలో చేరి నాలుగేళ్ల పాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తూ ఇటీవల కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ ఏడాది నియామకాలకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అగ్నిపథ్పై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం కాగా, పలువురు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో చేరే అవకాశం రానివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించినట్లయిందన్నారు.
'డిసెంబరు 2022లో మొదటి బ్యాచ్ అగ్నివీరులకు శిక్షణ ప్రారంభిస్తాం. 2023 జూన్ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై షెడ్యూల్ ప్రకటిస్తాం' అని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు.