SIRపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! బాధితులకు భారీ ఊరట..!
దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) చుట్టూ చర్చ జరుగుతోంది. చనిపోయిన, తరలిపోయిన ఓటర్ల పేర్లు తీయాల్సి ఉండగా, వాటికి తోడు తమ రాజకీయ ప్రత్యర్దుల ఓట్లను ఈసీ సాయంతో అధికార పార్టీలు తొలగిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతటితో సరిపెట్టకుండా ఎస్ఐఆర్ లో పేరు తీసేస్తే పౌరసత్వం రద్దయినట్లేనని, సంక్షేమ పథకాలు కూడా రద్దవుతాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది.
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో ఓటర్ల పేర్ల తొలగింపు వల్ల పౌరసత్వం రద్దయినట్లు కాదని ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియ కింద నిర్వహించే విచారణ పౌరసత్వ నిర్ధారణ కాదని, అది కేవలం ఎన్నికలలో పాల్గొనడానికి మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, దొడ్డిదారిన పౌరసత్వ ధృవీకరణ చర్య అని పిటిషనర్లు, ప్రతిపక్షాలు వాదిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు కీలకంగా మారింది.

ఈసీ పౌరసత్వాన్ని నిర్ధారించగలదా అనే విస్తృత ప్రశ్నకు, సుప్రీంకోర్టు ఒక కీలకమైన షరతును స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేర్చాలా లేదా తొలగించాలా అనే పరిమిత కోణంలో మాత్రమే ఈసీ దానిని పరిశీలించగలదని కోర్టు పేర్కొంది. కమిషన్ పేరును తొలగించవచ్చు, కానీ అంతమాత్రాన వారు ఇకపై భారత పౌరులు కాకుండా పోరు. పౌరసత్వ నిర్ధారణతో దీనికి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 2002/2003 ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని ఓటర్లు, ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తితో తమ వంశపారంపర్య సంబంధాన్ని నిరూపించుకోవాలని కోరిన ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది.














Click it and Unblock the Notifications