SIR Phase 3: తెలుగు రాష్ట్రాల సహా 19 చోట్ల ఎస్ఐఆర్ మూడో దశ ప్రారంభం..!
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR Phase 3)మూడో దశకు చేరుకుంది. మూడో దశలో భాగంగా దేశంలో మిగిలిన 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఇందులో కొండ, పర్వత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లను మినహాయించారు. ఇవి కాక ఇంకా ఎస్ఐఆర్ పూర్తి కాని 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ జరగనుంది.
ప్రస్తుతం దేశంలో జనాభా లెక్కల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీంతో ఎస్ఐఆర్ ను కలిపి, రెండు ప్రక్రియలలోనూ క్షేత్రస్థాయి పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ షెడ్యూల్ను రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జనాభా లెక్కల రెండవ దశ పూర్తి కావడం, అలాగే ఎత్తైన, మంచుతో కప్పబడిన ప్రాంతాలలో వాతావరణ సంబంధిత సవాళ్లను పరిగణనలోకి తీసుకుని, మినహాయించబడిన ప్రాంతాల షెడ్యూల్ను తదుపరి దశలో విడిగా జారీ చేస్తారు. కార్యాచరణపరమైన పరిమితులు, కఠినమైన భూభాగ పరిస్థితుల కారణంగా ఈ 3 ప్రాంతాలలో అమలును వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది. క్షేత్రస్థాయిలో అమలుకు పరిస్థితులు అనుకూలించిన తర్వాత దీనిని ప్రకటిస్తామని పేర్కొంది.

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ మూడవ దశలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని, తమ గణన పత్రాలను సమర్పించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అనర్హుల పేర్లు చేరకుండా నివారిస్తూ కేవలం అర్హులైన ఓటర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటమే ఎస్ఐఆఱ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. మూడో దశలో ఎస్ఐఆర్ చేపట్టే రాష్ట్రాల్లో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ, చండీఘడ్, దాద్రా నగర్ హవేలి, డామన్-డయ్యూ ఉన్నాయి.














Click it and Unblock the Notifications