TG SIR: "సర్" లో ఫ్యామిలీ సర్టిఫికెట్ పై తేల్చేసిన హైకోర్టు..!
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR)లో దాదాపు కోటి మంది ఓట్లు తొలగించారు. దీంతో వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ తాజాగా పూర్తయింది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఇందులో దాదాపు కోటి మంది ఓటర్ల పేర్లు గల్లంతుకావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ జూలై 25న ఫ్యామిలీ రిజిస్టర్ సర్ఠిఫికెట్ల జారీకి నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేషన్ కార్డుల ఆధారంగా అధికారులు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. వీటిలో రేషన్ కార్డులో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యులు అందరి డేటా ఉంటోంది. దీనిపై ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ రేషన్ కార్డుతో సమానమని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేల్చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు తీసుకున్న వారు కూడా ఓటర్ల జాబితాలో తమ ఓట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.














Click it and Unblock the Notifications