ఎయిర్ పోర్టులపై కేంద్రం కీలక నిర్ణయం-పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలోకి
దేశవ్యాప్తంగా కరోనా తర్వాత మారిన పరిస్ధితుల్లో నిధుల కొరతతో అల్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రంగాల్లో వ్యూహత్మక పెట్టుబడుల ఉపసంహరణ తెరతీస్తున్న కేంద్రం.. ఇందులో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకునేందుకు సిద్దంగా లేవు. దీంతో త్వరలో స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, రవాణా సౌకర్యాలతో పాటు పలు ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల్ని కేంద్రం ఉపసంహరించుకోనుంది.
వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.6 ట్రిలియన్లను అర్జించాలనుకుంటున్న కేంద్రం.. ఇందులో ఎయిర్ పోర్టులను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రైవేటు సంస్ధల చేతుల్లో ఉన్న ఎయిర్ పోర్టులతో పాటు ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఎయిర్ పోర్టుల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని క్రమంగా తెరపైకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. అన్నీ ఒకసారిగా తెరపైకి వస్తే దేశాన్ని అమ్మేస్తున్నామన్న విమర్శలు వస్తాయన్న భయంతో ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటోంది.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల్ని ఉపసంహరించే జాబితాలో రహదారులు, రైల్వేలు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వ్యూహాత్మక రంగాల్ని వదిలిపెట్టి మిగతా అన్నింటిలోనూ పెట్టుబడుల్ని ఉపసంహరించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కరోనా కారణంగా కేంద్రానికి వచ్చే ఆదాయాలు తగ్గిపోవడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇలా పెట్టుబడుల ఉపంసహరణ ద్వారా 1.75 లక్షల కోట్లు అర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బడ్జెట్ లో కూడా ప్రతిపాదనలు చేసింది. దీన్నే ఇప్పుడు అమల్లోకి తీసుకురాబోతోంది. అదే జరిగితే కీలక రంగాల్లో ప్రైవేటు సంస్ధల హవా పెరగబోతోంది.
ఈ ఏడాది ఇప్పటికే కేంద్రం ఎల్ఐసీ, బీపీసీఎల్, ఎయిర్ ఇండియాతో పాటు పలు స్టీల్ ప్లాంట్లలోనూ పెట్టుబడుల ఉపసంహరణకు ప్లాన్ ప్రకటించింది. ఏడాది లోపు ఆయా సంస్ధల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడు ఇదే జాబితాలో ఉన్న ఎయిర్ పోర్టుల్లోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.