శరద్ పవార్కు బిగ్ షాక్: చీలిక వర్గ నేత చేతికి వెళ్లిన ఎన్సీపీ
Sharad Pawar: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలను జారీ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎవరికి దక్కుతుందనే విషయాన్ని తేల్చేసింది. చీలిక వర్గ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేతికి ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు దక్కుతుందని స్పష్టం చేసింది. ఎన్సీపీకి అసలైన నేతగా అజిత్ పవారేనని నిర్ధారించింది ఈసీ.
ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు ఎవరికి దక్కాలనే విషయంపై ఆరు నెలలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు సాగిస్తూ వచ్చింది. న్యాయ నిపుణులతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం ఎన్సీపీ ఎన్నికల గుర్తు వివాదాన్ని పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గానికి అనుకూలంగా రూల్ జారీ చేసింది.
పార్టీ రాజ్యాంగం, దానికి ఉన్న శాసన సభ్యుల సంఖ్యాబలం, సంస్థాగతంగా రూపొందించుకున్న మార్గదర్శకాలు.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వివరించింది. సంస్థాగతంగా మెజారిటీని కలిగి ఉన్న వారి వాదనకు మద్దతుగా శరద్ పవార్ వర్గం వేసిన పిటీషన్లను పరిశీలించినట్లు తెలిపింది.
ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన అజిత్ పవార్.. తనకు మద్దతు ఇస్తోన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు. ఎన్సీపీని, దాని గుర్తు తనకే దక్కుతుందంటూ ఈసీకి తెలియజేశారు. దీనిపై విచారణల అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications