అజిత్ పవార్పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపు
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది.
శనివారం ఉదయం ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలతో మద్దతు తెలపడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. అజిత్ పవార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ వెంట ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లిన అజిత్ పవార్పై చర్యలు తప్పవని ఇంతకుముందే హెచ్చరించారాయన.
హెచ్చరికలు చేసినట్లు అజిత్ పవార్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి కూడా తొలగించారు. ఇప్పటికే పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వద్దకు చేరుకోవడం గమనార్హం. అజిత్ పవార్ తమకు ఫోన్ చేసి రాజ్భవన్కు రమ్మనడంతో వెళ్లామని, అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియని వారు చెప్పారు.
ప్రస్తుతం అజిత్ పవార్ వద్ద 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఢిల్లీ, గుజరాత్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 30న బల నిరూపణ ఉండటంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. శివసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను అత్యవసరంగా పిలిపించి సమావేశాలు నిర్వహిస్తున్నాయి.