క్యాడర్ లో అయోమయం సృష్టిస్తోన్న అజిత్: బీజేపీతో పొత్తు అసాధ్యం: శివసేన-కాంగ్రెస్ తోనే..: శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సహకారాన్ని అందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన ఓ ట్వీట్.. కలకలం పుట్టించింది. శరద్ పవార్ తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే ఎన్సీపీ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనేది ఆ ట్వీట్ సారాంశం. ఇది కాస్తా ఏ రేంజ్ లో ప్రకంపనలను పుట్టించిందంటే.. చివరికి శరద్ పవార్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. వివరణ ఇచ్చుకునేలా చేసింది.
అజిత్ పవార్ ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే శరద్ పవార్ తెర మీదికి వచ్చారు. తన సోదరుడి కుమారుడు చేసిన ట్వీట్ కు వివరణ ఇచ్చుకున్నారు. అజిత్ చేసిన ప్రకటనలను విశ్వసించ వద్దని కోరారు. పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి, అయోమయానికి దారి తీసేలా ఆయన ప్రకటన ఉందని అన్నారు. భారతీయ జనతాపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం గానీ, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలను పార్టీ చేయలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.
There is no question of forming an alliance with @BJP4Maharashtra.
— Sharad Pawar (@PawarSpeaks) November 24, 2019
NCP has unanimously decided to ally with @ShivSena & @INCMaharashtra to form the government. Shri Ajit Pawar’s statement is false and misleading in order to create confusion and false perception among the people.
శివసేన- కాంగ్రెస్ కూటమిలోనే ఎన్సీపీ కొనసాగుతోందని తేల్చి చెప్పారు. శివసేన-కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో మరో మాటకు అవకాశమే లేదని అన్నారు. అజిత్ పవార్ చేసిన ప్రకటన అనంతరం పార్టీ కిందిస్థాయి నాయకులు తనకు ఫోన్లు చేస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లే తాను అధికారిక ప్రకటన చేస్తున్నానని అన్నారు.
శివసేన-కాంగ్రెస్ కూటమిలో కలిసే ఉన్నామని, దీనికి భిన్నంగా ఎవరు? ఎలాంటి ప్రకటన చేసినా దాన్ని విశ్వసించవద్దని అన్నారు. అలాంటి ప్రకటనలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని శరద్ పవార్ చెప్పారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని అన్నారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతమని, పార్టీకి సంబంధం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, అనంతరం శివసేన-కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శరద్ పవార్ ధీమాను వ్యక్తం చేశారు.