పోలీసుల కాల్పులలో రాజకీయ నాయకుడి హతం
అమృత్ సర్: పోలీసులు కారు మీద జరిపిన కాల్పులలో పంజాబ్ లో అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీకి చెందిన రాజకీయ నేత హతమయ్యాడు. అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం పోలీసులు కావాలనే తమనాయకుడిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
అయితే తమ మీద కాల్పులు జరపడం వలనే తాము ఎదురు కాల్పులు జరిపామని, పోలీసులకు గాయాలైనాయని పోలీసు అధికారులు సమర్థించుకుంటున్నారు. అమృత్ సర్ లో నివాసం ఉంటున్న ముఖ్ జిత్ సింగ్ అలియాస్ మోఖా అనే రాజకీయవేత్త హత్యకు గురైనాడు.
మంగళవారం రాత్రి పోద్దు పోయిన తరువాత అమృత్ సర్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. పేరు పోందిన గ్యాంగ్ స్టర్ నెంబర్ ప్లేట్ లేని కారులో అమృత్ సర్ లోకి వస్తున్నాడని సమాచారం ఇచ్చాడు. పోలీసులు అప్రమత్తం అయ్యారు. అమృత్ సర్ కు 8 కిలో మీటర్ల దూరంలో అన్ని వాహనాలను పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో అటు వైపు అకాలి దళ్ నాయకుడు ముఖ్ జిత్ సింగ్ ప్రయాణిస్తున్న కారు వచ్చింది. తరువాత కారు నిలపమని చెప్పడంతో కారులో నుండి కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు.
ఈ కాల్పులలోనే ముఖ్ జిత్ సింగ్ మరణించాడు. అకాలీదళ్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేయిస్తామని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ముందు జాగ్రత చర్యగా పోలీసు అధికారులు గట్టిబందో ఏర్పాటు చేశారు.