సంచలనం: యోగి-మోడీలను ఒంటరిగా ఎదుర్కోలేక ఒక్కటవుతున్న మాయా-అఖిలేష్
లక్నో: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. ఇది మరోసారి రుజువు కానుంది. బీహార్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పాతికేళ్ల వైరాన్ని పక్కన పెట్టి జేడీయూ, ఆర్జేడీలు ఒక్కటయ్యాయి. పలుచోట్ల బీజేపీ ధాటిని ఎదుర్కోలేక కలుస్తున్నారు.
ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లోను ఆసక్తికర రాజకీయం చోటు చేసుకోబోతోంది. ఇన్నాళ్లు నువ్వా.. నేనా అన్నట్లుగా ఉన్న సమాజ్ వాది పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు కలవనున్నాయి. ఎందుకంటే యూపీలో బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేక అవి కలిసేందుకు సిద్ధమవుతున్నాయి.
యోగిని, బీజేపీని ఢీకొట్టేందుకు బలం సరిపోక
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల యూపీ ప్రజలు ఎక్కువ మంది సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా మోడీ హవా 2014లో అంతకాకున్నా 2019లో మళ్లీ గెలిచే విధంగా కనిపిస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు చాలామంది ఒక్కటవుతున్నారు.
మాయావతి అంగీకారం!
ఇందులో భాగంగా యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎస్పీ, బీఎస్పీ సిద్ధమవుతున్నాయి. మాయావతి కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ అధికార ప్రతినిధి పంఖూరి పాఠక్ ఓ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సంచలనం రేపుతోంది.
యూపీలో బీజేపీని దెబ్బతీసేందుకు ఎస్పీకి బీఎస్పీ సహకారం
ఫుల్పూర్, గోరక్పూర్లలో జరగనున్న లోకసభ ఉప ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి బీఎస్పీ మద్దతు ఇస్తుందని, మాయావతి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, బహుజన్ సెక్యులర్ అలయెన్స్ ఏర్పాటు చేస్తామని పాఠక్ ట్వీట్ చేశారు.
2019లోను కలిసే అవకాశం
బీఎస్పీ మద్దతిస్తుందనే వార్తలపై ఎస్పీ నేత సునీల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎస్పీ ఎలాగు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఎస్పీ బీజేపీని గట్టిగా ఎదుర్కొంటుందని చెప్పారు. బీఎస్పీ మద్దతిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న యూపీలో రెండు లోకసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. బీజేపీని నిలువరించేందుకు ఎస్పీకి ఇప్పుడు బీఎస్పీ మద్దతివ్వడంతో పాటు 2019లో లోకసభ ఎన్నికలే లక్ష్యంగా చేతులు కలపనున్నారని అంటున్నారు.