అఖిలేష్! మాటిచ్చావ్గా, కుటుంబం కలిసే ఉండాలని: అపర్ణా యాదవ్
లక్నో: మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీని ములాయం సింగ్ యాదవ్ చేతిలో పెట్టాలని అపర్ణా యాదవ్ అన్నారు. ఆమె ములాయం చిన్న కోడలు. ఇటీవల ఎన్నికల్లో ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.
ములాయంను పక్కన పెట్టి, అఖిలేష్ పెత్తనం ఎత్తుకున్నందునే ఇలా జరిగిందని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అఖిలేష్పై విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి అఖిలేష్ను అసంతృప్త నేతలు టార్గెట్ చేస్తున్నారు. అపర్ణ తాజాగా పార్టీని ములాయంకు అప్పగించాలన్నారు.
అఖిలేష్ హామీ ఇచ్చారు
అఖిలేశ్యాదవ్ ఇప్పటికైనా పార్టీ బాధ్యతలను తండ్రి ములాయం సింగ్కు అప్పగించాలని అపర్ణా యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎస్పీ బాధ్యతలను అఖిలేశ్.. ములాయంకు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు అఖిలేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని అనుకుంటున్నానని చెప్పారు.
కుటుంబం కలిసే ఉండాలని కోరుకుంటున్నా
తన గురించి కుటుంబానికి మొత్తం తెలుసునని, ములాయం తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం, వేరే ఏమీ ఆలోచించనని, ఆయన పట్ల ఇతరులు వ్యవహరించిన తీరు అసంతృప్తిగా ఉందని, భవిష్యత్లో ఏం జరుగుతుందో తెలియదని, కానీ తమ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పారు.
కొందరు నేతల వల్లే ఓడిపోయా
లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఓడిపోవడానికి పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలే కారణమని అపర్ణా యాదవ్ ఆరోపించారు. కొంతమంది పార్టీ నేతలు అహంకారం వల్ల ప్రచార కార్యక్రమాలకు మద్దతు ఇవ్వలేదని, ఈ విషయాన్ని తాను ములాయం, అఖిలేష్ల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ ప్రయోజనం ఏమీ కనిపించలేదన్నారు.
సీఎం ఆదిత్యనాథ్పై..
ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఆమె కితాబిచ్చారు. యూపీ పరిస్థితుల్లో కచ్చితంగా ఆయన మార్పులు తీసుకొస్తారని ఆమె నమ్మకం ఉందన్నారు. యోగికి కొంత సమయం ఇవ్వాలని, ఆయనతో జంతుసంరక్షణ గురించి చర్చించానని, సానుకూలంగా స్పందించారన్నారు. కబేళాలను మూసివేయించడం చాలా మంచి నిర్ణయం కానీ వాటిని జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న వారికి వేరే ఉపాధి కల్పిస్తే బాగుంటుందన్నారు.