పంజాబ్లో వచ్చేది హంగే.. అధికార పీఠం ఎవరిదంటే? : అమరీందర్ సింగ్ కొత్త జోస్యం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అందరి దృష్టి పంజాబ్ పోల్ పైనే ఉంది. దీంతో ఇక్కడ అధికారం కోసం ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. మరలా అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అటు హస్తం వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ కూటమితో పాటు ఆమ్ ఆద్మీ కూడా పంజాబ్ గడ్డపై జెండా పాతేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాదు..
అయితే ..ఈ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పోరులో చాలా చోట్ల ఈ సారి చతుర్ముఖ పోటీ ఉందని పేర్కొన్నారు. పలు చోట్ల ఐదుగురి మధ్య పోటీ ఉండగా... పలు చోట్ల స్వతంత్రులు సైతం గట్టి పోటీ ఇస్తున్నారని పేర్కొన్నారు. పనితీరులో సరిగ్గా లేకపోతే వారి గెలుపు కష్టమేనని అన్నారు. ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాబోదన్నారు.

రోజు రోజుకు దిగజారుతున్న ఆప్
ఆమ్ఆద్మీ పార్టీ గురించి ప్రజలు చర్చించుకుంటున్నా.. ఆపార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని అమరీందర్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎం అభ్యర్థిగా ప్రకటించిన చరణ్ జిత్ సింగ్ చన్నీ దళితుడని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలు కులాలకు, మతాలకు కాకుండా.. సామర్థ్యానికి ఓటు వేయాలని కోరారు. తను ఇది తొమ్మిదో ఎన్నిక అని చెప్పారు. ప్రజల కోసం తన జీవితాంతం పనిచేస్తానని స్పష్టం చేశారు. దేశంలోనే గొప్ప ప్రదేశంగా పంజాబ్ ను తీర్చిదిద్దాలన్నదే తన తపన అని అమరీందర్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications