రమ్య ఎక్కడుందో తెలియదన్న అంబరీష్, కేపీసీసీ చీఫ్ పదవిపై...
బెంగళూరు: మాండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి రమ్య ఎక్కడ ఉందో తనకు తెలియదని ప్రముఖ సినీ నటుడు, కర్నాటక రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ అంబరీష్ చెప్పారని తెలుస్తోంది. రమ్య గత సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఉప ఎన్నికల్లో అదే స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ నుండిగెలుపొందారు.
కేపీసీసీ చీఫ్ రేసులో...
అంబరీష్ ప్రస్తుతం సిద్ధరామయ్య మంత్రివర్గంలో హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కన్ను కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పైన కూడా పడిందని అంటున్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా దానిని తీసుకుంటానని చెప్పారు. కేపీసీసీ అధ్యక్షునిగా చేస్తే తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు.
ప్రజలు వారి కులాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదు..
ప్రజలు తమ కులాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంబరీష్ చెప్పారు. వేలాది కులాలు ఉన్నందున ఎన్యూమరేటర్లకు ఇబ్బందిగా మారిందన్నారు. తమ కులం గురించి అడిగితే జనాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారని జనాభా లెక్కింపు స్టాఫ్ తనతో చెప్పిందని అంబరీష్ చెప్పారు. క్యాస్ట్ వివరాలు అడిగితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.
వేలాది కులాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కుల గణనను మీరు సమర్థిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా..., అందులో తప్పేమీ లేదని మంత్రి అంబరీష్ చెప్పారు. సామాజిక న్యాయం చేసేందుకే కుల గణన అని చెప్పారు. ప్రభుత్వం ప్రజల సోషల్, ఎకనామిక్ స్టేటస్ తెలుసుకుంటుందని చెప్పారు.