అంబేద్కర్ మనుమడిపై దాడి, ఫిర్యాదు
మహారాష్ట్ర: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగింది. అయితే కార్యకర్తలు అడ్డుకోవడంతో అంబేద్కర్ మనుమడు ఆనంద్ రాజ్ అంబేద్కర్ దాడి నుండి తప్పించుకున్నారు. పోలీసులు ముందు జాగ్రత చర్యగా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
ఆనంద్ రాజ్ రిపబ్లికన్ సేన అధ్యక్షుడిగా ఉన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లా లోని మహాద్ లోని పీపుల్స్ ఎడ్జుకేషన్ సొసైటి కాలేజ్ ఆవరణంలో ఆనంద్ రాజ్ అంబేద్కర్ పై పలువురు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన చుట్టుపక్కల కార్యకర్తలు ఉన్నారు.
ఆ సందర్బంలో కార్యకర్తలు ఆనంద్ రాజ్ అంబేద్కర్ కు రక్షణ కల్పించారు. మంగళవారం మద్యాహ్నం ఒంటి గంట సమయంలో కాలేజ్ ప్రిన్సిపల్ ను కలవడానికి వెళ్లిన సమయంలో కొందరు తమ మీద దాడి చేశారని కార్యకర్తలు ఆరోపించారు. దాడిలో ఒకరికి తీవ్రగాయాలైనాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.
అయితే కొందరు ఇనుప రాడ్లు, కర్రలు, ఆయుధాలు చేతపట్టుకుని వచ్చి తమ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని రిపబ్లికన్ సేన పార్టీ జనరల్ సెక్రటరి వాసంత్ కాంబ్లీ ఆరోపించారు. స్థానిక శివసేన కార్యకర్తలు తమ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.