కేంద్ర కేబినెట్ విస్తరణ: వీరికే చోటు -5రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మోదీ, బీజేపీ కీలక అడుగులు
నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు కావొస్తుండటం, కేంద్ర మంత్రివర్గంలో భారీగా ఖాళీలు ఏర్పడటం, ఉన్నవాళ్లపై అదనపు భారం, ఇంకొద్ది నెలల్లో కీలకమైన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వీటన్నింటిని నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక అడుగులు వేస్తున్నారు. కేంద్ర కేబినెట్ ను భారీ స్థాయిలో ప్రక్షాళన లేదా విస్తరణ చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

విస్తరణకు వేళాయెరా..
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణకు సమయం ఆసన్నమైనట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. కేబినెట్ విస్తరణ విషయమై ప్రధాని మోదీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్షాలతో కలిసి కసరత్తు పూర్తి చేశారని, ఒకట్రెండు రోజుల్లో విస్తరణ ఖాయమని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈనెల 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా మంత్రివర్గ ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,

ఎన్నికల రాష్ట్రాలకు పదవులు
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతలకు ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్లో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన జ్యోతిరాదిత్య సింథియాకు తన కుర్చీని కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత్ బిశ్వా శర్మకు వదులుకున్న అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్లకు ఈ విస్తరణలో ప్రముఖ స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారట. దేశంలో కీలక రాష్ట్రంగా ఉండడం, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడం, బీజేపీకి రాజకీయంగా ఉత్తరప్రదేశ్ను ఎక్కువ ప్రాతినిధ్యం ఉండడం ఉత్తరప్రదేశ్కు కలిసి వస్తున్న అంశాలని తెలుస్తోంది.

మిత్రులకు షాకివ్వనున్న బీజేపీ
బిహార్ నుంచి కేబినెట్కు అధిక ప్రాతినిధ్యమే రానుంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విస్తరణలో ఆయనకి చోటు దక్కొచ్చని అంటున్నారు. ఇక ఎల్జేపీ నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వనున్నారట. ఎల్జేపీ మాజీ అధినేత రాం విలాశ్ పాశ్వాన్ మరణంతో కేంద్ర కేబినెట్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే బీజేపీకి మిత్రుడిగా వ్యవహరించిన చిరాగ్ పాశ్వాన్ను పక్కనపెట్టి, రాం విలాస్ తమ్ముడు పశుపతి పారస్కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సముచిత స్థానమే ఇవ్వనున్నారని తెలుస్తోంది. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చేందుకు తాజా విస్తరణలో ఆయా రాష్ట్రాల వారికి అవకాశం కల్పించనున్నారు.

కేంద్ర కేబినెట్లో భారీగా ఖాళీలు
2019 సాధారణ ఎన్నికల్లో విజయం అనంతరం ఏర్పడిన కేబినెట్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా లబ్ది పొందే విధంగా బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మరోసారి తన కుర్చీని నిలబెట్టుకునే విధంగా మోదీ ఎత్తులు వేస్తున్నట్లు, దానికి అనుగుణంగానే మోదీ తన కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ సంఖ్య 81. అయితే ప్రస్తుతం మోదీ కేబినెట్లో 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా 28 మందిని త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications