ధర్డ్ వేవ్ భయాలు-రెండు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో పెద్దలందరికీ తొలిడోస్ పూర్తి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే ధర్డ్ వేవ్ భయాలు చుట్టుముడుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కరోనా ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా భారీ ఎత్తున జనం గుమికూడే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇలాగే పండుగల సందర్భంగా ప్రజలు గుమి కూడటం వల్లే సెకండ్ వేవ్ తలెత్తింది. దాని ప్రభావం ఇంకా తగ్గనేలేదు. అప్పుడే ధర్డ్ వేవ్ భయాలు నెలకొన్నాయి. దీంతో పండుగల పేరెత్తితేనే జనం బెంబేలెత్తే పరిస్ధితి.
పండుగల సీజన్ లో ధర్డ్ వేవ్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న కేంద్రం పలు మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందించాలన్నది కేంద్రం స్పష్టం చేస్తోంది. ప్రజలు భారీగా గుమికూడే కార్యక్రమాల్ని చేపట్టవద్దని రాష్ట్రాలకు సూచిస్తోంది. తప్పనిసరై భారీ ఎత్తున జనం గుమికూడే చోట వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారినే అనుమతించాలని కేంద్రం సూచిస్తోంది. అలా కాకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తే ఆ తర్వాత ధర్డ్ వేవ్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ను కూడా వేగంగా పూర్తి చేయాలని రాష్ట్రాల్ని కోరుతోంది. దీంతో ఇప్పటికే ఏపీతో పాటు పలు రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్ లు చేపడుతున్నాయి.
సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలోనూ ఇప్పటికే పెద్దలందరికీ ( 18 ఏళ్లు పైబడిన వారందరికీ ) వ్యాక్సిన్ తొలి డోస్ వేయడం పూర్తయిందని కేంద్రం ఇవాళ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 16 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని, అలాగే 54 శాతం జనాభాకు తొలి డోస్ పూర్తయిందని కేంద్రం తెలిపింది.