అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు- 15 ఏళ్ల దాంపత్యానికి తెర- ప్రకటన విడుదల
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావుల దాంపత్యానికి నేటితో తెరపడింది. 15 ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్న వీరిద్దరూ తాజాగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు విడుదల చేసిన ప్రకటనను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇవాళ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో బాలీవుడ్ తో పాటు మిగతా చిత్ర పరిశ్రమ వర్గాల్లోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
2005 డిసెంబర్ 28న వివాహ బంధంతో ఒక్కటైన అమీర్ ఖాన్, కిరణ్ రావు.. అనంతరం పిల్లలు కలగకలేదు. దీంతో వారు సరోగసీ విధానంలో ఓ బాలుడికి జన్మనిచ్చారు. వీరి కుమారుడి పేరు ఆజాద్. కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితంలో అమీర్-కిరణ్ జంట మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇద్దరి మధ్య పలు విషయాల్లో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని కొంత కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇవాళ ప్రకటన రూపంలో వెల్లడించారు.
"15 ఏళ్ల దాంపత్య జీవితంలో మేం జీవితానికి సరిపడా మధుర స్మృతుల్ని, సంతోషాన్నీ పంచుకున్నాం. మా బంధం పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమతో చిగురించింది. ఇప్పుడు మేం మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. కానీ ఈసారి భార్యా భర్తలుగా కాదు ఉమ్మడి తల్లితండ్రులుగా వేర్వేరు జీవితాల్లో. కొంతకాలం క్రితమే విడిపోదామని నిర్ణయించుకున్నాం. ఇలా విడిగా ఉండాలన్న ఏర్పాటు చేసుకోవడం సౌకర్యంగా ఉంది. మేం పెంచి పెద్ద చేసిన మా కుమారుడు ఆజాద్ కు నమ్మకమైన తల్లితండ్రులుగా ఉండాలనుకుంటున్నాం. సినిమాల్లో, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టుల విషయంలో మాత్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మా జీవితాల్లో వచ్చిన ఈ మార్పుకు మద్దతిచ్చిన మా కుటుంబాలు, స్నేహితులు, బంధువులకు ధన్యవాదాలు. ఎందుకంటే వారు లేకుండా మేం లేం. ఇప్పుడూ వారు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. విడాకులు మా ప్రయాణానికి ముగింపు కాదు, కొత్త జీవితానికి ఆరంభం మాత్రమే." అని వారు తమ ప్రకటనలో తెలిపారు.