అనుమానాస్పద స్థితిలో ర్యాడిసన్ బ్లూ హోటల్ ఓనర్ మృతి - మిస్టరీ డెత్..!!
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో కలకలం చెలరేగింది.
మృతుడి పేరు అమిత్ జైన్. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ఘజియాబాద్లో గల ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమాని. ఘజియాబాద్ కౌశంబీ ప్రాంతంలో ఉంటుందీ హోటల్. ఢిల్లీ తూర్పు ప్రాంతంలో ఉన్న కామన్వెల్త్ గేమ్స్ విలేజ్లో నివాసం ఉంటోన్నారు. తన నివాసాన్ని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ నుంచి నొయిడాకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. నొయిడాలో ఫ్లాట్ను కూడా అద్దెకు తీసుకున్నారు. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ కావాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో తన ఢిల్లీ నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. దీన్ని తొలుత ఆయన కారు డ్రైవర్ గుర్తించారు. వెంటనే మాండవలి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అమిత్ జైన్ను పత్పర్గంజ్లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆయన నొయిడాలో కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఉన్నారని, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తన సోదరుడు కరణ్ను కలిశారని, తన కారులోనే ఆయనను ఇంటి వద్ద దింపారని, రోజంతా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారని చెబుతోన్నారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం లేదని అంటోన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తోన్నామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థల నుంచి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు.