నెహ్రూ తప్పిదం వల్లే కాశ్మీర్ సమస్య: అమిత్ షా
న్యూఢిల్లీ: కాశ్మీర్ ఇప్పటికీ ఓ సమస్యగా ఉండటానికి కారణం భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూనే అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఆరోపించారు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. భారత్, పాకిస్థాన్ల విభజనకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వానిదే బాధ్యత అని అమిత్ షా అన్నారు.
1948లో పాకిస్థాన్ మద్దతునిచ్చిన గిరిజన దొంగలను తరిమి కొడుతున్న సమయంలో అనూహ్యంగా కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు.
'అకస్మాత్తుగా, ఎలాంటి కారణం లేకుండా సంధిని ప్రకటించేశారు. కారణం తెలియదు. దేశంలో ఏ నాయకుడూ ఇలాంటి చారిత్రక తప్పిదం చేయలేదు. అప్పుడు జవహర్లాల్జీ కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే, కాశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు' అని అమిత్ షా స్పష్టం చేశారు.
బుధవారం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్మారకోపన్యాస కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునేందుకే నెహ్రూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్యామాప్రసాద్ మృతిపై ఆనుమానాలు వ్యక్తం చేశారు. 1953లో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాశ్మీర్ వెళ్లిన శ్యామప్రసాద్ అక్కడే మణించిన పరిస్థితుల నేపథ్యాన్ని ఆయన ప్రశ్నించారు.
అది ఖచ్ఛితంగా హత్యేనని అన్నారు. ఆనాటి ఘటనలపై నెహ్రూ వైఖరిని ఆయన తప్పు పట్టారు. శ్యామా మరణంపై విచారణ కూడా జరిపించలేదని రాయ్ విమర్శించారు. ఈరోజు కోల్కతా భారత్లో అంతర్భాగంగా ఉందంటే ఆ ఖ్యాతి శ్యామాప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని రాయ్ అన్నారు.