అమిత్ షా యూటర్న్..! 48 గంటల్లో మారిన సీన్-విపక్షానికి కండిషన్లు..!
నీట్ అక్రమాలపై ఢిల్లీలో విద్యార్ధులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ను అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేసిన ఘటనపై సమాధానం చెప్పేందుకు పార్లమెంట్ కు రావాలని విపక్షాలు పదే పదే కోరుతున్నా పట్టించుకోకుండా ఉండిపోయిన హోంమంత్రి అమిత్ షా ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో అమిత్ షా ఎప్పుడొస్తారని ఇవాళ కూడా విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. అయితే పార్లమెంట్ కు రావడానికి బేషరతుగానే అంగీకరించిన అమిత్ షా 48 గంటల్లోనే యూటర్న్ తీసుకుని విపక్షానికి షరతులు పెట్టారు.
పార్లమెంట్ కు వచ్చి ఢిల్లీ విద్యార్దులపై పోలీసుల బలప్రయోగంపై సమాధానం ఇచ్చేందుకు అంగీకరించిన అమిత్ షా.. నిన్న జార్ఖండ్ లో విద్యార్ధుల నిరసనలు, అంతకు ముందు పంజాబ్ లో జరిగిన నిరసనలపై కూడా చర్చిద్దామంటూ విపక్షానికి షరతు పెట్టారు. తద్వారా తనను టార్గెట్ చేస్తున్న విపక్షాలను .. వారు అధికారంలో ఉన్న పంజాబ్ (ఆప్), జార్ఖండ్ (కాంగ్రెస్-జేఎంఎం)లో నిరసనలపై ఇరుకునపెట్టేందుకు ప్లాన్ చేశారు. దీంతో విపక్షాలు అమిత్ షా షరతుక అంగీకరిస్తాయా, వారు అంగీకరించకపోతే అదే కారణం చూపి మరో రెండు రోజుల్లో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలకు ఆయన రాకుండా ఉండిపోతారా అన్న చర్చ జరుగుతోంది.

అమిత్ షా స్పందించే ముందు ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రభుత్వం ప్రతిపక్షానికి తెలిపింది. కేవలం ఒక ప్రకటన చేయడం అనేది ఒక లాంఛనప్రాయమైన చర్య మాత్రమే అవుతుందని, తమకు కావాల్సింది కేవలం ప్రకటన కాదని, సమగ్ర చర్చ అని ప్రభుత్వ వర్గాలు ఇవాళ పేర్కొన్నాయి. మరోవైపు ఇప్పటికే కల్పిత చర్చల పట్ల తనకు ఆసక్తి లేదని విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పేర్కొన్నారు. నేరుగా జూలై 20న విద్యార్థులపై కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో పార్లమెంటుకు తెలియజేయాలని హోం మంత్రిని ప్రత్యేకంగా కోరారు. అమిత్ షా వచ్చి పార్లమెంటులో ప్రసంగిస్తారా అనేది అసలు ప్రశ్న కాదు. ఢిల్లీలో కాల్పులకు ఎవరు అనుమతి ఇచ్చారో అమిత్ షా స్పష్టం చేయాలన్నదే అసలు ప్రశ్న అని రాహుల్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే అమిత్ షా రావడం, విపక్షం కోరుతున్నట్లుగా సమాధానం చెప్పడం సాధ్యం కాదని తేలిపోతోంది.














Click it and Unblock the Notifications