amphan cyclone: తీరం దాటిన తుఫాను, బెంగాల్, ఒడిశాల్లో అతలాకుతలం
కొల్కతా/భువనేశ్వర్: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 4గంటలపాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు.

6 లక్షల మంది తరలింపు..
పశ్చిమబెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతియా దీవుల వద్ద ఆంపన్ తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లోని సుమారు 6 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈదురుగాలుల బీభత్సం.. రాకాసి అలలు..
ఈ అంపన్ తుఫాను కారణంగా ఇప్పటికే బెంగాల్, ఒడిశా తీరాలు అతలాకుతలమయ్యాయి. ఆయా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రపు అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహపాత్ర తెలిపారు.

తీవ్ర వాయుగుండంగా..
కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అనేక చెట్లు నేలకూలుతున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుఫాను తీరం దాటాక గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇది బంగ్లదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు.

సహాయక సిబ్బంది అప్రమత్తం..
తుపాను తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలించారు. బెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంతాల్లో నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 6లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిన సిబ్బంది... మిగితావారిని అప్రమత్తం చేశాయి.












Click it and Unblock the Notifications