లింగమార్పిడి శస్త్ర చికిత్స ఫెయిల్-నరకం అనుభవించిన ట్రాన్స్జెండర్ ఆత్మహత్య-గతంలో కేరళ అసెంబ్లీకి పోటీ..?
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసి... చివరి నిమిషంలో తప్పుకున్న ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొచ్చిలోని ఎడప్పల్లి ప్రాంతంలో ఉన్న తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం(జులై 20) సాయంత్రం 6.30గంటలకు అనన్య ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన తొలి ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించిన అనన్య ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.

పోలీసులు ఏమన్నారు...
అనన్య ఆత్మహత్యపై పోలీసులు మాట్లాడుతూ... మంగళవారం(జులై 20) అనన్య భాగస్వామి ఇంట్లో లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణను బట్టి అనన్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని... పోస్టుమార్టమ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎర్నాకుళం మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు. 28 ఏళ్ల అనన్య కుమారి స్టేజీ షో యాంకర్గా,సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుగా,రేడియో జాకీగా గుర్తింపు పొందారు.

గతేడాడి లింగమార్పిడి శస్త్ర చికిత్స...
ట్రాన్స్వుమెన్గా మారిన క్రమంలో జూన్,2020లో అనన్య లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శస్త్ర చికిత్స ఫెయిల్ అయిందని కొద్దిరోజుల క్రితం ఆమె ఆరోపించారు. 'వైద్యుల నిర్లక్ష్యానికి నేనొక బాధితురాలిగా మిగిలిపోయాను. ఇప్పుడు నా ప్రైవేట్ పార్ట్ ఒక మాంసం ముద్దలా మారిపోయింది. అది ఏమాత్రం స్త్రీ జననాంగంలా లేదు. రీసర్జరీ చేయాలని నేను వైద్యులను కోరుతున్నా. నాకు న్యాయం జరగాలి.' అని ఇటీవల అనన్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నరకం అనుభవించిన అనన్య...
ప్రైవేట్ పార్ట్ వద్ద తీవ్రమైన నొప్పి కారణంగా తాను ఏ పనీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మళ్లీ సర్జరీ చేయించేందుకు కొంతమంది విరాళాలు సేకరణ కూడా చేపట్టారు. ఇంతలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. లింగమార్పిడి చికిత్స విఫలమవడంతో ఆమె నరకం అనుభవించినట్లు సన్నిహితులు చెబుతున్నారు.ఆ బాధను తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్...
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మలప్పురం జిల్లాలోని వెంగార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డెమోక్రాటిక్ జస్టిస్ పార్టీ(డీఎస్జేపీ) తరుపున అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ దాఖలు చేశారు. తద్వారా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన తొలి ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ఒకరోజు ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనను చంపేస్తామని సొంత పార్టీ నేతల నుంచే బెదిరింపులు వస్తుండటంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు.












Click it and Unblock the Notifications