ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజు: ఆ రెండు కీలక పరిణామాలను గుర్తు చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి పూర్తిగా భారతదేశంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ కూడా చేశారు. ఈ రెండు చరిత్రాత్మక పరిణామాలు కూడా ఆగస్టు 5నే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ గురువారం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజు: ప్రధాని మోడీ
'రెండేళ్ల క్రితం జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఏడాది క్రితం ఇదే రోజున అయోధ్యలో శ్రీరామ మందిరానికి భూమి పూజ చేశాం. ప్రస్తుతం ఆ మందిరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి' అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అందుకే ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
దేశాభివృద్ధిలో యూపీ కీలక పాత్ర..
ఉత్తరప్రదేశ్లోని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం మోడీ మాట్లాడారు. కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ను రాజకీయం కోణంలోనే చూస్తున్నారన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తున్న అంశాన్ని గత పాలకులు విస్మరించారని అన్నారు. అయితే, కొన్నేళ్లుగా మాత్రమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని ప్రధాని చెప్పారు. వచ్చే దీపావళి పండగ వరకు పేదలకు ఉచిత రేషన్ సదుపాయం కొనసాగుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్పై వదంతలను విశ్వసించవద్దని ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు మరింత మందిని ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా దేశ ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనాలను పాటించాలని సూచించారు.
విపక్షాల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు
మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించి 41ఏళ్ల నిరీక్షణకు తెరదించారంటూ హాకీ క్రీడాకారుల ప్రదర్శనను కొనియాడారు. ఒలింపిక్స్ పతకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మనదేశానికి సరికొత్త గుర్తింపు లభిస్తోందన్నారు. భారత యువత ముందుకు సాగుతోందనడానికి, దేశం పురుగోతి సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సమయంలో.. ఢిల్లీలో కొంతమంది పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే, వారి స్వార్థపూరిత రాజకీయాలతో దేశ పురోగతిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
ఆగస్టు 5నే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర భూమి పూజ
కాగా, ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూకాశ్మీర్ను శాసనసభ కలిగివుండే కేంద్రపాలిత ప్రాంతంగానూ, లడఖ్ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతంగానూ ఏర్పాటు చేశారు. అయితే, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి అమిత్ షా అప్పుడే ప్రకటన చేశారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణంకు 2020, ఆగస్టు 5న జరిగింది. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 నాటికి మందిరం సిద్ధమవుతుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.