సూపర్ కిడ్స్: నాలుగేళ్లకే 9వ తరగతి చదివేస్తోంది!
లక్నో: సాధారణంగా చాలా మంది తమ పిల్లలకు నాలుగేళ్లు వచ్చిన తర్వాతే పాఠశాలలో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఉత్సాహవంతులైన తల్లిదండ్రులు మాత్రం 2,3ఏళ్ల నుంచే పాఠశాలలకు పంపించేస్తారు. అయితే వారు పాఠశాలలకు వెళ్లి నర్సర్సీలో ప్రవేశించాల్సిందే కానీ.. ఒకటి రెండో తరగతులైతే చదవలేరు. కానీ, ఇక్కడ ఓ సూపర్ కిడ్ మాత్రం నాలుగేళ్లకే తొమ్మిదో తరగతి అభ్యసిస్తోంది. ఆ చిన్నారే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన అనన్య.
అనన్య అద్భుత మేధస్సుకు అందరూ అబ్బురపడిపోవాల్సిందే. అయితే ఇది మనందరికీ కొత్తేమో గానీ, అనన్య కుటుంబంలో మాత్రం కాదు. ఎందుకంటే.. అనన్య సోదరి సుష్మ 15ఏళ్ల వయసులో మైక్రోబయాలజీలో డాక్టరేట్ చదువుతోంది. ఆ సబ్జెక్ట్లో సుష్మ మాస్టర్స్ పూర్తి చేసి డాక్టరేట్ చేయడం విశేషం.

అంతేగాక, అనన్య సోదరుడు శైలేంద్ర తొమ్మిదేళ్ల వయసులో హైస్కూల్ చదువు పూర్తి చేశాడు. ఇప్పుడు అనన్య అదే వరుసలో నాలుగేళ్లకు తొమ్మిదో తరగతిలో చేరింది. ఈ బాలమేధావుల తండ్రి తేజ్ బహదూర్ వర్మ లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
అనన్యకు సంబంధించిన విశేషాల్లోకి వెళితే.. ఓరోజు ఆయన అనన్యను తనతో మార్కెట్కు తీసుకెళ్లగా సుష్మ, శైలేంద్ర చదువుకున్న సెయింట్ మీరా కళాశాల అధ్యాపకురాలు కలిశారు. ఆయన ఆమెతో మాట్లాడుతుంటే అనన్య ఓ పుస్తకం తీసుకొని చదివేయడం మొదలెట్టింది.
ఇది గమనించిన అధ్యాపకురాలు అనన్యను తీసుకెళ్లి పరీక్ష పెట్టగా తొమ్మిదో తరగతిలో చదవడానికి అర్హత సాధించింది. దీంతో పాపను నేరుగా తొమ్మిదో తరగతిలో చేర్పించారు. అనన్య తన సోదరి, సోదరుల కంటే కూడా తెలివైనదని స్కూల్ మేనేజర్ వినోద్ రత్రా పేర్కొన్నారు.
ఆమెకు ఉచితంగా చదువు చెప్పిస్తామన్నారు. అనన్య అక్క సుష్మ కూడా ఐదేళ్ల వయసులో తొమ్మిదో తరగతిలో చేరినట్లు చెప్పారు. కాగా, తమ పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్లు ఏమీ లేవని.. వాళ్లు ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటారని వారి తండ్రి తేజ్ బహదూర్ వెల్లడించారు.
అంతేగాక, 'అనన్య ఎప్పుడూ ఏదైనా పుస్తకం తీసుకుని చదువుతూనే ఉంటుంది. వెంటనే అర్థం చేసుకుని నేర్చుకుంటుంది. రామాయణం కూడా చదివింది.. అందులో చాలా వరకు గుర్తుంచుకుంటుందని చెప్పారు. తమ పిల్లలు బాలమేధావులుగా ఉండటం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను' అని అనన్య తండ్రి తేజ్ బహదూర్ అన్నారు.












Click it and Unblock the Notifications