మరో షాక్: రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) శనివారం రద్దు చేసింది.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. గాంధీ కుటుంబంతో అనుబంధం ఉన్న ప్రభుత్వేతర సంస్థ. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జూలై 2020లో, హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదిక ఆధారంగా, ఫౌండేషన్ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆ తర్వాత ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దు గురించి తెలియజేసే నోటీసును.. ఆర్జీఎఫ్ ఆఫీస్ బేరర్లకు పంపించారు.
మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆర్జీఎఫ్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇతర ట్రస్టీలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.
1991లో స్థాపించబడిన, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వైకల్యం మద్దతు మొదలైన అనేక క్లిష్టమైన సమస్యలపై పని చేసింది. దీని వెబ్సైట్ ప్రకారం ఇది విద్యా రంగంలో కూడా పనిచేసింది.