మరో స్వాతి?: ప్రేమించలేదని యువతికి నిప్పంటించి..
చెన్నై: తమిళనాడులోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో నెల రోజుల క్రితం తనను ప్రేమించలేందంటూ ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ ఉన్మాది నరికిచంపిన ఘటన మరువకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదంటూ ఓ ఉన్మాది ఓ యువతికి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన విల్లుపురం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. అయితే, ఆ ఉన్మాది అక్కడే మరణించగా, బాధితురాలు మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సెంథిల్(32) ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం కాలంగా నవీన అనే యువతి వెంటపడుతున్నాడు. ఈ సమయంలో అతన్ని రైలు ఢీకొనడంతో యాక్సిడెంట్లో కుడి చేయి, కుడి కాలు పోయాయి. కాలు, చేయి లేకపోవడంతో నవీన తనను రెజెక్ట్ చేస్తోందని భావించిన అతను.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు.
ఈ నేపథ్యంలో శనివారం సెంథిల్ నవీన ఇంటిబయట దాక్కున్నాడు. నవీన ఇంట్లో పెద్దలందరూ వెళ్లిపోయే వరకూ అక్కడే కాపుకాశాడు. వాళ్లు ఇల్లు వదిలి బయటకు వెళ్లగానే లోపలికి ప్రవేశించాడు సెంథిల్. ఇంట్లో నవీనతో పాటు ఉన్న ఆమె సోదరి, సోదరులను కత్తి చూపించి బెదిరించాడు. మొదట నవీనకు నిప్పంటిచే ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో, తన మీద తానే పెట్రోల్ పోసుకున్నాడు.
ఆ తర్వాత నవీనను గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. అప్పటికే సెంథిల్ మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన నవీనను పాండిచ్చేరిలోని జింపర్ ఆస్పత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో నవీన ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.