శుక్రవారం ప్రార్థనలపై టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. యూపీలో చల్లారని సీఏఏ నిరసనలు..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టినా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా ఆగ్రా, బులంద్ షహర్, గజియాబాద్, సహరాన్పూర్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ అదనపు బలగాలను మోహరించిన ప్రభుత్వం.. పరిస్థితిని కంట్రోల్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది.

ఇంటర్నెట్ బంద్..
సీఏఏ వ్యతిరేక నిరసనల జోరు తగ్గకపోవడం, శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగ్రా, బులద్ షహర్, గజియాబాద్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి శనివారం వరకు నెట్ సేవలు ఉండవని, ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ జారీ చేశామని ఉన్నతాధికారులు చెప్పారు. పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

పోలీసుల అదుపులో వేలాది మంది..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగిన నిరసనల్లో ఎక్కువ మంది చనిపోయింది ఉత్తరప్రదేశ్ లోనే కావడం గమనార్హం. గురువారం నాటికి మొత్తం 19 మంది నిరసనకారులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏ నిరసనలకు సంబంధించి మొత్తం 327 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, 1,113 మందిని అరెస్టు చేశామని, ప్రివెంటివ్ చర్యల్లో భాగంగా 5,558 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications