హిందీ భాషకు వ్యతిరేకం: ఒక్కటి అయిన కన్నడ, తమిళ్, మరాఠీ, ఆంధ్రా మద్దతు కావాలి!
బెంగళూరు: హిందీ భాషను బలవంతంగా మా మీద రుద్దుకూడదని, మెట్రో రైల్వే స్టేషన్లలో హిందీ భాష ఉండకూడదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక నారాయణగౌడ వర్గం డిమాండ్ చేసింది. కర్ణాటక రక్షణ వేదికకు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన నాయకులు మద్దతు ఇచ్చారు.
శనివారం బెంగళూరు నగరంలో కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో హిందీ భాషకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంకే పార్టీ తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ, ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్, మహారాష్ట్రలోని రాజ్ ఠాక్రేకి చెందిన ఎంఎన్ఎస్ పార్టీ నుంచి సందీప్ దేశ్ పాండ్ పాల్గోన్నారు.
ఈ సమావేశంలో కన్నడ సాహితీవేత్తలు బరగూరు రామచంద్రప్ప, చంద్రశేఖర పాటిలతో సహ వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ భాషలను నాశనం చెయ్యడానికి ఉత్తర భారతదేశం నాయకులు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
మెట్రో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులలోని నామఫలకాల మీద ప్రాంతీయ భాషలు మాత్రమే ఉండాలని, హిందీ భాష ఉండకూడదని అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మాకు ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, బెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు మద్దతు ఇవ్వాలని మనవి చేశారు.
ఇటీవల నమ్మ బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హిందీ భాష బోర్డులను కన్నడ సంఘాలు ధ్వంసం చేశాయి. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సైతం హిందీ భాషను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హిందీ భాషకు వ్యతిరేకంగా ఇప్పుడు కర్ణాటకలో పోరాటం మొదలైయ్యింది.