అనూహ్య : వీడుతున్న మిస్టరీ, ఆమెతో ఉన్నదెవరు?
ముంబై/విజయవాడ: ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. అనూహ్య హత్య కేసు మిస్టరీ క్రమంగా వీడుతోంది. ముంబై లోక్ మాన్య తిలక్ టెర్మినల్ సిసి ఫుటేజీని దర్యాప్తులో నిశితంగా పోలీసులు పరిశీలించారు.
శుక్రవారం ఉదయం ఈ కేసులో అనుమానితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట అనూహ్య హత్య కేసు రైల్వే పోలీస్ స్టేషన్లో నమోదు కాగా, విచారణలో భాగంగా రైల్వేస్టేషన్ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు వెయిటింగ్ హాల్లో అనూహ్యతో కలిసి ఉన్న అనుమానితున్ని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణను చేపట్టనున్నారు.
ఆమె రైలు దిగిన రోజు వెయిటింగ్ రూంలో కాసేపు నిరీక్షించినట్లుగా ముంబై పోలీసులు గుర్తించారు. దాదాపు ఇరవై ఆయిదు నిమిషాలు ఆమె అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆమె ఓ యువకుడితో మాట్లాడినట్లుగా, అతను ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారని సమాచారం.
ఆమె ఆ తర్వాత అతనితో వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. అతను వెంటనే ఎవరన్నది ఆరా తీసి ముంబై కుర్లీ జిఆర్పి పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సిసి టివి ఫుటేజీలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి గుర్తించారు.
కాగా, మచిలీపట్నంకు చెందిన ఎస్తేరు అనూహ్య అదృశ్యమైన అనంతరం పదకొండు రోజుల తర్వాత ముంబైలోని ఓ నిర్జన ప్రదేశంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆమె తండ్రి ఇటీవల కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాఫ్తును వేగవంతం చేశారు.