ఆంధ్రప్రదేశ్ వరదలు: ‘టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ - టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన తెలిపారు. వర్షాల వల్ల తిరుమలలో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమలలో ఎక్కడెక్కడ ఏమేం దెబ్బతిన్నాయంటే..
- మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.
- రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయి.
- తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు తరలించారు.
- శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ దెబ్బతిన్నాయి.
- తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.
- కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం దెబ్బతింది.
- వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది.
స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామని సుబ్బారెడ్డి తెలిపారు.
టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల ,తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి తెలిపారు.
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
వరద బాధితులను రక్షించే ప్రయత్నంలో కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద తీవ్ర నష్టం కలిగించింది.
మొత్తం 18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగులో వరదలో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఆపరేషన్ చేపట్టింది.
https://twitter.com/APPOLICE100/status/1461972961485754374
గ్రామస్థులను కాపాడే క్రమంలో కెళ్ల శ్రీనివాస రావు అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం నీటిలో మునిగి చనిపోయారు. శ్రీనివాస రావు విజయనగరం జిల్లాకు చెందిన ఎస్డీఆర్ఎఫ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.
- తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు... ఇంట్లోంచి బయటకు రావొద్దన్న అధికారులు
- ఆంధ్రప్రదేశ్: దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష బీభత్సం, మనుషులు గల్లంతు... కొట్టుకుపోతున్న మూగజీవాలు
తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట
కడప జిల్లా రాజంపేట సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దాంతో ఎగువ నుంచి వస్తున్న నీరు దిగువకు వెళ్లిపోతోంది.
కట్ట నిన్న ఉదయం తెగిందని, దాంతో భారీ స్థాయిలో వరద ప్రవాహం సోమశిలకు చేరిందని అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఐదు, పది టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు వరదల వల్ల కట్ట తెగిపోవడంతో ఇక్కడ ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు.
- ఆంధ్రప్రదేశ్ వరదలు: 5 జిల్లాలలో భారీ నష్టం, 18 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
ప్రాజెక్టు నిర్వహణ లోపాల వల్లే ఈ సమస్య వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఎగువన ఉన్న పించా ప్రాజెక్టు కట్ట కూడా తెగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిందని, సుమారు లక్షన్నర క్యూసెక్కుల వరద నీరు రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కూడా తెగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ డ్యామ్ కట్ట తెగిపోవడం వల్ల 12 గ్రామాల్లో వరద హఠాత్తుగా విరుచుకుపడింది. నందలూరు, రాజంపేట మండలాల్లో కొందరు వరద నీటిలో గల్లంతయ్యారు.
కడప జిల్లాలో 12 మంది మరణించారని, 12 నుంచి 15మంది ఆచూకీ దొరకాలని అధికారులు చెబుతున్నారు.
కిలోమీటరు మేర కొట్టుకుపోయిన రైలు పట్టాలు
రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్లు కోట్టుకుపోయాయి. పునరుద్ధరణకు వారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రెండు ట్రాక్లు అందుబాటులోకి రావాలంటే 15 రోజులు పడుతుందని భావిస్తున్నారు.
మరోవైపు, రేణిగుంట-కడప జాతీయ రహదారిపై చెయ్యేరు వంతెన తెగిపోవడంతో 4 రోజులుగా రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను ఇవాళ క్లియర్ చేశారు.
కడప జిల్లా పులపుత్తూరు గ్రామంలో వరద ప్రభావం ఇలా ఉంది.
అయితే, ఒక పురాతన ఆలయం మాత్రం వరదను తట్టుకుని నిలబడింది.
ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం
మరోవైపు, భారీ వరదలకు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ధ్వంసమైంది.
వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వీటిని పునరుద్ధరించడానికి, మరమ్మత్తులు చేయడానికి వారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను చూశారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.
ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతోపాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు.
రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రేణిగుంట ఎయిర్పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తా - చంద్రబాబు
అటు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోని టీడీపీ నేతలతో సమీక్షించారు. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణి జరుగుతోంది. టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- జూనియర్ ఎన్టీఆర్: 'చాలా పెద్ద తప్పు, అరాచక పరిపాలనకు నాంది.. ఇక్కడితో ఆపేయండి’
- హిందూ-ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీలపై దాడులు చేసినప్పుడు... - దృక్కోణం
- 'స్త్రీ, పురుష జననేంద్రియాలతో పుట్టాను.. ఇప్పుడు మహిళగా మారాను.. దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది’
- కాన్పు సమయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే తల్లీబిడ్డలకు రక్ష
- కమలా హారిస్: అమెరికా ప్రెసిడెంట్ అధికారాలు పొందిన తొలి మహిళ
- 'జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)