ఎపిఎన్జీవో సభలో విషాదం: ఒకరి మృతి, ఆద్వానీతో చిరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరుగుతోన్న ఎపిఎన్జీవో సభలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. సమైక్యాంధ్ర కోరుతూ ఢిల్లీలో ఇవాళ, రేపు ఎపిఎన్జీవోలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో హస్తినలో వేలాది మంది ఎపిఎన్జీవోలు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎపిఎన్జీవో నేత దామోదర్ జోషికి సోమవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఎపిఎన్జీవోలు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎపిఎన్జీవోలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ ఘటనతో ఎపిఎన్జీవో సభలో విషాదఛాయలు అలముకొన్నాయి.
ఎపి భవన్ వద్ద కట్టుదిట్టం
ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల పాటు ఎపిఎన్జీవోలు ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నా
సమైక్యాంధ్ర కోసం జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నా చేపట్టనుంది. ఇందుకోసం భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు.
అద్వానీతో కేంద్రమంత్రులు
బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజు తదితరులు కలిశారు. బిల్లుకు మద్దతివ్వవద్దని కోరారు.