Arvind Kejriwal అరెస్ట్ తో నాయకత్వ సంక్షోభంలో ఆప్; పార్టీపగ్గాలు చేపట్టేది ఆమేనా!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ సంక్షోభం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు అన్నది? ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలలో, అన్ని రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పార్టీ నాయకత్వాన్ని వహించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేది ఎవరు అన్నది? ప్రధానమైన ప్రశ్న కాగా, పార్టీ సారథ్యాన్ని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారిణి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ చేపట్టవచ్చని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కొందరు కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన మంత్రుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆతిషీ, సౌరభ్ భరద్వాజ్ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరు చూడాలి అన్న దానిపైన గతంలోనే అభిప్రాయ సేకరణ జరిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో 90 శాతం ప్రజల నుండి కేజ్రీవాల్ నే ఎక్కడి నుండైనా సరే పార్టీని, ప్రభుత్వ కార్యాకలాపాలను నడపాలని కోరినట్టు ఇటీవల కాలంలో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా తెలిపారు. ప్రజల మద్దతు కేజ్రీవాల్ కు మెండుగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళితే ఆయన సీఎంగా పాలన సాగించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం పార్టీలో నాయకత్వ లేమి నేపథ్యంలో నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో పార్టీని ముందుండి నడిపించే వారిని ఎన్నుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. తన అరెస్టును ముందే ఊహించిన అరవింద్ కేజ్రీవాల్ , పార్టీ విషయంలో కూడా ముందే ఒక ప్లాన్ లో ఉండి ఉంటారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications