చూపించమన్న కేజ్రీకి మోడీ ఝలక్, పదవిపై రాహుల్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని చూసేందుకు వచ్చానని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ రోడ్డు షోకు అనుమతి లేదంటూ రాఘన్పూర్ పోలీసులు అతనిని అడ్డుకున్నారు.
అంతకుముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ... గుజరాత్ ప్రభుత్వంతో పాటు మీడియా కూడా అభివృద్ధి జరిగిందని చెబుతోందని, అందుకే తాను గుజరాత్లో జరిగిన అభివృద్ధిని చూసేందుకు వచ్చానని తెలిపారు. గుజరాత్లో రామరాజ్యం ఉందని, విద్య, ఆరోగ్యం బాగా వృద్ధి చెందాయని, అవినీతి అంతమైపోయిందని అంటున్నారని, వాటిని చూసేందుకు వచ్చానన్నారు. మోడీ చేసిన అభివృద్ధిని చూపించాలన్నారు. నాలుగు రోజుల గుజరాత్ పర్యటన కోసం కేజ్రీవాల్ అహ్మదాబాద్ వచ్చారు.
ఆయన అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఎఎపి మద్దతుదారులు 'షీలా ఓడింది... మోడీకి ముందుంది' అంటూ నినాదాలు చేశారు. బిజెపి ఈ ఎన్నికల్లో ఎంతెంత ఖర్చు పెడుతుందని, ఆ పార్టీకి నిధులు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని పదవిపై రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిపై మరోసారి స్పందించారు. తాను భవిష్యత్తులో ప్రధాని అవుతానా? లేదా? అన్నది విషయం కాదన్నారు. తాను ప్రధానమంత్రిని కావడం తనకు ముఖ్యం కాదన్నారు. మహిళలు, యువతతో సహా భారతీయులందరూ ఇది తమ దేశమని భావించడం ప్రస్తుతం అవసరమన్నారు. రెండ్రోజుల మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ సిర్పూర్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ముచ్చటించారు.