ఫోజులివ్వను: కేజ్రీ, ఆటలో గెలుపు ఒక్కరిదే: బేడీ, కాంగ్రెస్కు జీరో
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హాఫ్ సెంచరీ దాటిన విషయం తెలిసిందే. ఏఏపీ అరవై, బీజేపీ 8 స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తమ పార్టీ విజయంపై స్పందించారు.
ఇది ప్రజల విజయమని అన్నారు. ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పారు. అవినీతి, వీఐపీ సంస్కృతిని తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా ముఖ్యమంత్రిగా పని చేస్తానని తెలిపారు. ఢిల్లీలో అవినీతి అంతమే లక్ష్యంగా పని చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. తాను ఫోజులిచ్చే నేతను కానని చెప్పారు.
అవినీతి అంతమే తన లక్ష్యమన్నారు. ఈ గెలుపు తనకు ఎలాంటి ఉద్విగ్నాన్ని ఇవ్వలేదని, తాను ఆమ్ ఆద్మీగానే ఉంటానని చెప్పారు. కాగా, తర్వాతి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితాల పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా స్పందించారు. ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు నీతివంతమైన ప్రభుత్వానికే మొగ్గు చూపారని చెప్పారు. ఢిల్లీ ప్రజలు నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. తమ వద్ద ఢిల్లీ అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక ఉందని తెలిపారు. ఢిల్లీకి స్వచ్ఛమైన పాలన ఇవ్వడానికి మంచి నాయకుడిని కలిగి ఉన్నామన్నారు.
ఫలితాలపై కిరణ్ బేడీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పైన ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ స్పందించారు. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. ఇద్దరు ఆట ఆడేటప్పుడు ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రెఫరెండం కాదన్నారు.